Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది ఆయన లోక్సభ పరిధిలోని సెగ్మెంట్ కావడంతో, ఈ గెలుపు ఆయనకు రాజకీయంగా కీలకం కానుంది. దీంతో కీలక నేతలు ఎవరు వచ్చినా రాకపోయినా, ఆయన సింగిల్గా ప్రచారం చేపడుతూ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. అయితే, పార్టీలోని ఇతర కీలక నేతలు, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవారు ప్రచారానికి దూరంగా ఉండటం ఇప్పుడు బీజేపీ అంతర్గత రాజకీయాలపై చర్చకు దారి తీసింది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ రోజున మాత్రమే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో కనిపించారు. ఆ ర్యాలీ ముగిసిన తర్వాత కీలక నేతలెవరూ ప్రచారంలో పెద్దగా భాగం కాకపోవడం గమనార్హం.
జాబితా నామమాత్రమే?
ఈ ఉప ఎన్నిక బాధ్యతలను కిషన్ రెడ్డి భుజాలపై మోపి, తమకేం పట్టదన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇది ఎలాగూ కిషన్ రెడ్డి లోక్సభ సెగ్మెంట్ కాబట్టి ‘మనకెందుకులే’ అని లైట్ తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే తమపై నిందలు పడతాయేమోననే భయాందోళనలో పలువురు నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీనివాస్ వర్మ వంటి వారిని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు ఏపీ బీజేపీ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్, పీవీఎన్ మాధవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది నేటికీ ప్రచారానికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం, పార్టీ తమను ప్రచారానికి రమ్మని పిలవలేదని సమాచారం. దీంతో వారిని పార్టీ పిలవడం లేదా? లేక వారే ప్రచారానికి వెళ్లడం లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీలో నిలబడతారా?
సమయం లేదుగా..!
నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుండగా, ప్రచారానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన స్టార్ క్యాంపెయినర్లు ఎప్పుడు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో కూడా ఎన్నికలు ఉండటంతో, కేంద్ర నేతలు ఇక్కడికి వస్తారా? లేక భారమంతా కిషన్ రెడ్డిపైనే మోపి బిహార్కే పరిమితమవుతారా? అనేది చూడాలి. మరోవైపు, టీడీపీ-జనసేన పొత్తుల ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. దీనికితోడు జూబ్లీహిల్స్లో ఏపీ సెటిలర్ల ఓట్లు కూడా ఉండటం కలిసిరానుంది. దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు చాడ సురేశ్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు, టీడీపీ-జనసేన కేడర్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం. టీబీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రచారంలో భాగమైతే ఫలితంపై ప్రభావం చూపగలుగుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న
