Harish Rao: నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల (Ration dealers) జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. హైదరాబాద్ లో రేషన్ డీలర్లు (Ration dealers) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్డీలర్లకు.. కాంగ్రెస్, బిజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అన్నారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం అన్నారు.
Also Read Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ
కమీషన్ ను 900 నుంచి రూ.1400లకు పెంచాలి
అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు 5వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు.. ఎన్నికల ముందు అబద్దపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారని, మాటలు తప్ప చేతలులేని కోతల ప్రభుత్వం ఇది అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2023 ఆగస్టు8న సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించామన్నారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్ ను 900 నుంచి రూ.1400లకు పెంచామన్నారు. ప్రభుత్వంపై 139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా
2014లో మెట్రిక్ టన్నుకు 200 రూపాయలుగా ఉన్న కమీషన్ ను, 1400లకు పెంచామన్నారు. 17వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపామన్నారు. కమీషన్ చెల్లించడమే కాదు, కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేశామని, రేషన్ డీలర్షిప్ వయో పరిమితిని 40 నుంచి 50ఏళ్లకు పెంచామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమీషన్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు 5వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read: Crime News: జోగిపేటలో దారుణం.. పండ్ల కోసం వెళ్లి యువకుడు మృతి