Raja Singh: కాషాయ పార్టీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తప్పవా? క్రమశిక్షణ ఉల్లంఘనలపై పార్టీ మళ్లీ ఆయన్ను సస్పెండ్ చేయనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రాజాసింగ్ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారు.
ఈనేపథ్యంలోనే ఆయనపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వం, క్రమశిక్షణ కమిటీకి వచ్చిన ఆదేశాల మేరకు తొలుత త్వరలోనే రాజాసింగ్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు సైతం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా ఈ అంశంపై రాజాసింగ్ సైతం స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలను బయటపెడతానని రాజాసింగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
Also Read: Anudeep Durishetty: నిధులిచ్చాం పనులెందుకు చేయలే?.. అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఫైర్!
కొంతకాలంగా సొంత పార్టీకి, నేతలకు వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత లేఖకు మద్దతు తెలపడంతో ఇష్యూ తారాస్థాయికి చేరుకుంది. పార్టీ లైన్ దాటిన నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గతంలో స్టాండప్ కమెడియన్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి రాజాసింగ్ బీజేపీ నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నారు. కొన్ని నెలల పాటు పార్టీకి దూరంగానే ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేసింది. అయినా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం బీజేపీ స్టేట్ చీఫ్ పై సైతం పరోక్షంగా విమర్శలు చేశారు. కమలం పార్టీలో మేకప్ మెన్ ఉన్నారని, టేబుళ్లు తుడిచే వారికి పదవులు దక్కుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీజేపీలో ఫాల్తుగాళ్లు ఉన్నారంటూ, వారు ఉన్నంతకాలం పార్టీ అధికారంలోకి రాదని, వారు బయటకు వెళ్తే తప్పా అధికారంలోకి రావడం కష్టమని తెలిపారు. కాగా కవిత లేఖకు మద్దతు ఇవ్వడం, కరీంనగర్ నుంచే తనపై వార్ మొదలైందని తాజాగా చేసిన కామెంట్స్ తో ఇష్యూ తారాస్థాయికి చేరుకుంది.
Also Read: GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?
రాజాసింగ్ కు త్వరలో క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసులు ఇస్తారని ప్రచారం మొదలవ్వడంతో ఎట్టకేలకు ఆయన స్పందించారు. పార్టీకి దమ్ముంటే తనకు నోటీస్ కాదని, నేరుగా సస్పెండ్ చేయాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. ఎందుకంటే కొజ్జాలను వెంబడి పెట్టుకుని పార్టీని స్ట్రాంగ్ చేయలేమని, ధర్మ కార్యక్రమాలు చేయలేమని, పార్టీని అధికారంలోకి సైతం తీసుకుని రాలేమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ పార్టీ తనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటి వరకు పార్టీ ఎవరి వల్ల నష్టపోయిందనే నిజాన్ని చెప్పి వారందరి జాతకాన్ని ప్రజలు ముందు పెట్టి మరీ వెళ్తానని రాజాసింగ్ బాంబు పేల్చారు. అదే నిజమైతే.. తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఎలా మారనుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో క్రమంగా బలపడుతుందనుకున్న తరుణంలో రాజాసింగ్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది సస్పెన్స్ గా మారింది. పార్టీ ఆయనకు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటుందా? లేక గతంలో మాదిరిగానే మరోసారి పార్టీ నుంచి బహిష్కరిస్తుందా? అనేది చూడాలి.
Also Read: Anudeep Durishetty: నిధులిచ్చాం పనులెందుకు చేయలే?.. అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఫైర్!