CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లకు మోదీ, కిషన్ రెడ్డిలే అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud) మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో తాము చేసి చూపించామన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామని వివరించారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపామని తెలిపారు.
Also Read: Siddepeta Tragedy: సిద్దిపేట జిల్లా చంద్లాపూర్లో విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రి కొడుకుల మృతి
అబద్ధాలు ఎందుకు?
గత ప్రభుత్వంలో కేసీఆర్(KCR) చేసిన చట్టం బీసీలకు శాపంగా మారిందని, అందుకే సవరిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపితే రాష్ట్రపతికి పంపించారన్నారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశామని చెప్పారు. ఆ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను కిషన్ రెడ్డి, మోదీ ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదని చెప్పారు. ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఓట్ల చోరీపై యుద్ధం
ఓట్ల చోరీ భరతం పట్టాల్సిన అవసరం ఉన్నదని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ఓట్ల చోరీకి బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసిందని, ఇది ఎలా సాధ్యమని సీఎం ప్రశ్నించారు. దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతున్నదని విమర్శించారు.
బిహార్లో 65 లక్షల ఓట్లను తొలగించారన్నారు. బతికున్న వాళ్లను చనిపోయినట్లు చూపారని, దీనిపై ప్రజలంతా మమేకమై ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించవచ్చన్నారు. ఇక బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందన్నారు. అప్పుడు తామంతా వెళ్లి కోటను కాపాడి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు.
గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలా శాసనం
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించిందని రేవంత్ తెలిపారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారన్నారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం అని చెప్పారు. ఇక నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయని, మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కోపం ఉంటే ఆయనపై చూపాలని, కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దని కోరారు. సమస్య వచ్చినప్పుడు పోరాడేందుకు ప్రజల నైతిక మద్దతు ఉండాలన్నారు. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుందన్నారు. నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని తెలిపారు విగ్రహాలు, వర్థంతులు, జయంతిల కోసం కాదు వారి స్ఫూర్తిని రగిలించిందుకే అని వివరించారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ