KTR: పార్టీ కేడర్ లో ఓవైపు జోష్ నింపాలని, మరోవైపు స్థానిక సంస్థలకు సన్నద్ధం చేసేందుకు గులాబీ సన్నద్ధమవుతుంది. అందుకు అనుగుణంగా పక్కా ప్రాణాళికలు రూపొందిస్తుంది. నేతలు పార్టీ మారిన నియోజకవర్గాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ నియోజకవర్గాల కేడర్ పార్టీ మారకుండా చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగానే అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలకు శ్రీకారం చుడుతుంది.
షెడ్యూల్ రూపకల్పనలో పార్టీ
బీఆర్ఎస్ పార్టీ పటిష్టతపై దృష్టిసారించింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. కేడర్ ను సంసిద్దం చేయాలని భావిస్తుంది. అందుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అందుకు షెడ్యూల్ రూపకల్పనలో పార్టీ నిమగ్నమైంది. అందులో భాగంగానే తెలంగాణ(Telangana) భవన్ లో నియోజకవర్గాల ముఖ్యనేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భేటీ అవుతున్నారు. సోమవారం ఒక్కరోజూ అచ్చంపేట, హుజూర్ నగర్, జూబ్లీహిల్స్, భద్రాచలం నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇలా ప్రతి రోజూ నియోజకవర్గాలవారీగా సమావేశం అవుతూ సభల తేదీలపై నిర్ణయం తీసుకుంటున్నారు. సభ సక్సెస్ బాధ్యతలు నేతలకు అప్పగిస్తున్నారు. ఈ సెగ్మెంట్ల సభలతో కేడర్ లో జోష్ నింపనున్నారు. పార్టీ వీడకుండా చర్యలు చేపట్టబోతున్నారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే భరోసాను ఇవ్వబోతున్నారు.
ఎమ్మెల్యే తీరును ఎండగట్టడం
తొలుత పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై దృష్టిసారించారు. ఆ పది నియోజకవర్గాల్లో ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోనేందుకు ఇప్పటి నుంచే కేడర్ ను సన్నద్ధం చేయాలని భావిస్తుంది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని, వారిలో యాక్టీవ్ గా పనిచేసేవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి నేతగా ప్రమోషన్ చేయాలని పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువగా స్థానాల్లో విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సభలకు శ్రీకారం చుట్టారు. గద్వాల సభ విజయవంతం కావడంతో , పార్టీ మారిన ఎమ్మెల్యే తీరును ఎండగట్టడంతో కేడర్ లో జోష్ నింపినట్లయింది. అదే విధంగా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భద్రాద్రి, బాన్సువాడ, స్టేషన్గపూర్, చేవెళ్ల, పటాన్ చెరువు, జగిత్యాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి లో సభ నిర్వహించాలని భావిస్తుంది. ఇప్పటికే ఆ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
Also Read: Congress: మణిపూర్లో ప్రధాని పర్యటన.. లాజిక్ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్
జోష్ పెంచేందుకు చర్యలు
మరోవైపు బీఆర్ఎస్(BRS) పార్టీలో పదవులు అనుభవించి పార్టీమారిన అసెంబ్లీ నియోజకవర్గాలపైనా దృష్టిసారించింది. ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీగా సైతం కొనసాగారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలో చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కేడర్ లోస్తబ్దత నెలకొంది. దీంతో కేడర్ లో జోష్ పెంచేందుకు చర్యలు చేపట్టింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(guvvala balaraju) పార్టీ మారడంతో ఆ నియోజకవర్గంలో ఈ నెల 27న సభ నిర్వహిస్తున్నారు. ఆ సెగ్మెంట్ల ఇన్ చార్జీ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(Marri Janardhan Reddy)కి అప్పగించగా సభ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే అర్రూరి రమేష్(Arruri Ramesh), ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇంద్ర కరణ్ రెడ్డి(Indra Karan Reddy), ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి(Vitthal Reddy), సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa), హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(Shanampudi Saidireddy) పార్టీ మారారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నియోజకవర్గాల్లోనూ సభలకు శ్రీకారం చుట్టింది.
ఇదిఇలా ఉంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో సెకండ్ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమవుతుంది. నియోజకవర్గంలో ఎవరు పార్టీమారినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టబోతుంది. గత తప్పులు పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏది ఏమైనా నియోజకవర్గ సభలతో గులాబీ స్పీడ్ పెంచబోతుంది.
Also Read; Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ
