BRS: ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ (BRS) కేడర్ ధీమా వ్యక్తం చేసింది. ఫలితాలు వెల్లడికావడం, గతంలో ఎప్పుడు లేని విధంగా భారీగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఇప్పుడు నిరాశలో ఉన్నది. గ్రేటర్లో గులాబీ పార్టీకి పటిష్టమైన పునాది ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను ప్రజలు కట్టబెట్టారు. అయితే, వరుసగా రెండో ఓటమితో పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. పార్టీపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఉన్నది, నాయకత్వ లోపమా, లేకుంటే సమన్వయం లేకపోవడమా అనే మీమాంసలో ఉన్నారు. ఇలా అయితే రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by election) ఫలితం రాష్ట్రంలో రాబోయే కాలంలో వచ్చే అన్ని ఎన్నికలపై ప్రభావం పడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కొనసాగాలా లేదా అనే డైలమాలో సైతం ఉన్నట్టు సమాచారం.
Also Read: BRS: జూబ్లీహిల్స్లో ఆ స్ట్రాటజీతోనే ఎదురుదెబ్బ.. వ్యూహం విఫలం
ఏం చేసినా నమ్మని జనం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఇతర జిల్లాల్లోని పార్టీ నేతలు, ముఖ్యనేతలను సైతం రంగంలోకి దింగి ప్రచారం చేయించింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఉమ్మడి జిల్లాల నేతలకు ఒక్కో డివిజన్ బాధ్యతలను అప్పగించింది. ముమ్మరం ప్రచారం చేయించింది. మునుగోడు వ్యూహాన్ని అమలు చేసింది. డివిజన్లకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులను నియమించింది.
రైతులకు రూ.12 వేలు, నిరుద్యోగ భృతి
కాంగ్రెస్ వైఫల్యాలు ఒకవైపు, బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశారు. అందులో భాగంగానే బాకీ కార్డు ఉద్యమం చేపట్టారు. గత నెల రోజులుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, నిరుద్యోగ భృతి ఇలా పలు అంశాలను బాకీ కార్డు ఉద్యమం చేపట్టింది. ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నివేదికను సైతం విడుదల చేశారు.
గులాబీ కేడర్లో మరింత నైరాశ్యం
హైడ్రా బాధితులతో కలిసి తెలంగాణ భవన్లో ఫొటో ఎగ్జిబిషన్, ఆటో కార్మికుల సమస్యలపై మాటామంతి కార్యక్రమం, సిటీ బస్సు ఛార్జీల పెంపుపై చలో బస్ భవన్, బస్తీ దవాఖానాల సందర్శన, కాలనీలో, కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టారు. రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు, ప్రచారంపై నిత్యం సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ ఏదీ కలిసి రాలేదు. ఒక్క డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ప్రజలు గులాబీ ప్రచారాన్ని విశ్వసించలేదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది. ఈ ఫలితం తర్వాత గులాబీ కేడర్లో మరింత నైరాశ్యం నెలకొన్నది.
Also Read:BRS: సైలెంట్ ఓటింగ్పై గులాబీ ఆశలు.. కచ్చితంగా గెలుస్తామని ధీమా!
