DK Aruna: బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ ఎప్పట్నుంచో కొనసాగుతోంది. ప్రాధాన్యత అంశంపై ఇరు వర్గాల మధ్య వైరం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై పలు సభల్లో పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) ప్రస్తావించారు. తాజాగా మరోసారి కొత్త, పాత నేతల అంశాన్ని ప్రస్తావించడంతో ఈ వైరం ఇంకా కొనసాగుతోందనేందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. పార్టీలో కొత్తవారు రావాల్సిందేనని, వారిని రానివ్వాల్సిందేనని అరుణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో పార్టీలో జాయినింగ్స్ను అడ్డుకుంటున్నదెవరు? అనే అంశంపై కొత్త చర్చ మొదలైంది. ఈ పరోక్ష విమర్శలు ఎవరిపై చేశారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆమె కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఆ సమయంలో ఎదుర్కొన్న పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక మరేమైనా కారణాలున్నాయా? అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
Also Read: Bhadradri Kothagudem District: జనరేటర్ల సాయంతో బ్లాస్టింగ్.. బెంబేలెత్తుతున్న గ్రామాలు
పాత.. కొత్త.. అదో రోత
ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆయనతో పాటే ఇంకొందరు బీఆర్ఎస్ మాజీలు సైతం వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ తరుణంలో మరోసారి డీకే అరుణ పాత, కొత్త అంశంపై ప్రస్తావించడం, పాత, కొత్త.. అదో రోత అంటూ విమర్శలు చేయడం దేనికి నిదర్శనమని శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా జాయినింగ్స్ విషయంలో రాష్ట్ర నాయకత్వం సమయాన్ని బట్టి చేరికలు జరుగుతాయని చెబుతుండగా ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరో కావాలనే అడ్డుకుని ఉంటారనే సందేహాలు నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు(Ramachandra Rao) నియామకం ఏకగ్రీవమైన అనంతరం నిర్వహించిన సభలోనూ జేజమ్మ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బలగం కావాల్సిందే..
శంషాబాద్(Shamshabad)లో బీజేపీ(Bjp) మండల అధ్యక్షుల ప్రశిక్షణా శిబిరం జరిగింది. ఇందులో భాగంగా రెండోరోజు జరిగిన ఈ శిబిరంలో మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District)ల మండల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) వారికి పలు అంశాలపై అరుణ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తల కృషిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ మోసలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రం నిధులను రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా మళ్లిస్తుందో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కొత్త బలగం రావాల్సిందేనని, కొత్తగా చేరిన వారైనా పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఎవరైనా పార్టీ గెలుపుకోసం పని చేయాల్సిందేనని పేర్కొన్నారు. పార్టీ బలాన్ని పెంచుకోవాలంటే చాలామంది కొత్తవాళ్లను బీజేపీలోకి రానివ్వాల్సిందేనని స్పష్టంచేశారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ పూర్తి సమయం ఇచ్చి మండల అధ్యక్షులు పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
మిస్ చేయొద్దు..
తెలంగాణలో పార్టీ గెలిచే వరకు కార్యకర్తలుగా ప్రయత్నం ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూశారని, ఇప్పుడు కాంగ్రెస్(Congress) మోసపూరిత పాలన చూస్తున్న ప్రజలు, బీజేపీ(Bjp)కి తెలంగాణలో అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు వేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై నివేదిక తయారు చేసుకోవాలని, ఆయా మండలాల పరిధిలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధుల వివరాలు రూపొందించుకుని ప్రజలకు వివరించాలని ఆమె సూచించారు.
వారంలో 3 రోజులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అలవాటు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు గెలిస్తేనే భవిష్యత్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అరుణ వివరించారు. ఇదిలాఉండగా తన సొంత జిల్లా నుంచే ఆమెపై వ్యతిరేకత మొదలైంది. డౌన్ డౌన్ అరుణ అంటూ సొంత పార్టీ నేతలే నినాదాలు చేశారు. బహుశా అందులో భాగంగానే ఆమె ఈ తరహా వ్యాఖ్యలను తరచూ చేస్తున్నారా? లేక పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Kishan Reddy: కేంద్రం నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు