Madhavilatha: హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసిన కొంపెల్లి మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పోలింగ్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. రిగ్గింగ్ చేసి గెలవడమూ ఓ విజయమేనా? అని పరోక్షంగా అసదుద్దీన్ ఒవైసీపై కామెంట్ చేశారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన తనపైకి వేల మంది రౌడీ మూకలు దాడికి ప్రయత్నించాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా అక్కడ పోలీసులు మిన్నకుండిపోయారని, రిగ్గింగ్ ఆపే ప్రయత్నాలు చేయలేదని ఆగ్రహించారు. అసలు ఇది భారతదేశమేనా? అక్కడ 144 సెక్షన్ ఉన్నదా? అని అనుమానించారు. ఈ రిగ్గింగ్పై తాను ఉదాసీనంగా ఉండబోనని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులకు ఇది వరకే ఫిర్యాదు చేశానని వివరించారు. అవసరమైతే రీపోలింగ్ పెట్టడానికీ ఎంత దూరమైనా సరే వెళ్లడానికి సిద్ధం అని అన్నారు.
16 ఏళ్ల ముస్లిం బాలిక ద్వారా నకిలీ ఓటు వేయించే ప్రయత్నం తన కళ్ల ముందు జరిగిందని, ఆమె రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిపోయిందని బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత అన్నారు. ఆ బాలికపై కేసు నమోదు చేయకుండా తల్లిదండ్రులకు అప్పగించారని వివరించారు. ఇలా రిగ్గింగ్ చేసి గెలవడమూ ఓ గెలుపేనా అని సెటైర్ వేశారు. రేపు ముంబయిలో ప్రచారం చేయాలని తనకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని, అక్కడి వెళ్లుతున్నట్టు తెలిపారు.
Also Read: తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ: ఎన్నికలపై కిషన్ రెడ్డి
పోలింగ్ రోజున మాధవీలత తీరు వివాదాస్పదమైంది. కొందరు ముస్లిం మహిళా ఓటర్ల బుర్ఖాలు తీసి పరీక్షించడమూ.. వారు వెంట తెచ్చుకున్న గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్పుల వివరాలతో సరిపోల్చి చూడటానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఒక ఓటరు ఇలా చేసినందుకు ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఓటర్లకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుందని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాధవీలత పై రెండు కేసులు నమోదయ్యాయి.