Sanchar Saathi APP: కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సంచార్ సాథి యాప్ను వినియోగదారులు తమ ఇష్టం వచ్చినట్లు డిలీట్ చేసుకోవచ్చు. “ మీకు సంచార్ సాథి అవసరం లేకపోతే మీరు దాన్ని తొలగించవచ్చు. యాప్ను అందరికీ పరిచయం చేయడం మా బాధ్యత. దాన్ని ఉంచుకోవాలా లేదా అనేది వినియోగదారుల నిర్ణయం” అని ఆయన తెలిపారు.
ఈ వ్యాఖ్యలు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మొబైల్ ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులకు జారీ చేసిన కొత్త ఆదేశాల తర్వాత వచ్చాయి. ఈ ఆదేశాల ప్రకారం, రాబోయే 90 రోజుల్లో మార్కెట్లోకి వచ్చే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో సంచార్ సాథి యాప్ను తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలి.
DoT అధికారిక ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. “భారతదేశంలో వినియోగించడానికి ఉద్దేశించిన ప్రతి మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారు, దిగుమతిదారు, ఈ ఆదేశాలు జారీ చేసిన 90 రోజుల నుంచి, DoT పేర్కొన్న సంచార్ సాథి మొబైల్ యాప్ను అన్ని హ్యాండ్సెట్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉండాలి.”
ఈ ఆదేశాలు ప్రస్తుతం భారత్లో ఫోన్లను తయారు చేస్తున్న పెద్ద కంపెనీలైన Apple, Samsung, Google, Vivo, Oppo, Xiaomi వంటి సంస్థలకు వర్తిస్తాయి.
కాంప్లయెన్స్ అమలు విధానం
పాత పరికరాలు: ఇప్పటికే విక్రయాల్లో ఉన్న ఫోన్లకు కూడా సంచార్ సాథి యాప్ను సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా పంపించాలి అని DoT ఆదేశించింది.
కాంప్లయెన్స్ రిపోర్టులు: అన్ని తయారీదారులు, దిగుమతిదారులు 120 రోజుల్లోగా DoTకు కాంప్లయెన్స్ వివరాలు సమర్పించాలి.
వినియోగదారుల దృష్టిలో కనిపించేలా: కొత్త ఫోన్ను మొదటిసారి ఆన్ చేసినప్పుడు లేదా సెటప్ సమయంలో ఈ యాప్ స్పష్టంగా కనిపించేలా చేయాలి, అలాగే దాని ఫీచర్లను ఎలాంటి పరిమితులు లేకుండా ఉపయోగించగలగాలి.
శిక్షలు: ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 తదితర చట్టాల ప్రకారం శిక్షలు విధించబడతాయని DoT హెచ్చరించింది.
