Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశంలోని హిందూ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై మండిపడ్డారు. ఈ అంశం తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టగా.. ఉదయనిధి స్టాలిన్ కు స్వల్ప ఊరట లభించింది.
‘కేసులు నమోదు చేయవద్దు’
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా బిహార్ లోనూ కేసు నమోదైంది. దీంతో ఈ విషయాన్ని ఉదయనిధి తరపు లాయర్ A.M. సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నుపుర్ శర్మ సహా గతంలో ఇలాంటి కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పును సింఘ్వీ ప్రస్తావించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం.. ఈ కేసులో ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని పేర్కొంది. అయితే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. అనంతరం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను వాయిదా వేసింది.
సనాతన ధర్మంపై ఉదయనిధి ఏమన్నారంటే
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం.. తొలి నుంచి ద్రవిడ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏ అవకాశం లభించిన హిందుత్వంపై అవాకులు చవాకులు పేలుతూ పలమార్లు విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మరింత రెచ్చిపోయారు. సనాతన ధర్మం వ్యాధి లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read: Amazon layoffs 2025: ఇక టీమ్ లీడర్లు, మేనేజర్ల వంతు.. భారీగా ఉద్యోగాల కోత!
గతంలో పవన్ వార్నింగ్
గతంలో తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ కళ్యాణ్.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారని అన్నారు. వ్యక్తులు ఉండొచ్చు, పోవచ్చని.. కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచీ ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో వ్యాఖ్యాలపై స్పందించమని ఉదయనిధిని మీడియా కోరగా.. ఆయన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.