Sukhesh Chandrashekhar | ఎన్నికల టైమ్ లో ఆప్ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశాడంటూ సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆప్ పార్టీ తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇదే అదునుగా చాలా మంది ఆ పార్టీ మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సుఖేష్ చంద్రశేఖర్ జైల్లో నుంచే ఓ లేఖ రిలీజ్ చేశాడు. ఇందులో ఏకంగా కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసేశాడు. ఎన్నికల్లో ఓడిపోయిన అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కు అభినందనలు అంటూ సెటైర్ వేశాడు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓడిపోయినందుకు సంతోషంగా ఉందంటూ సుఖేష్ పేర్కొన్నాడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందని.. కేజ్రీవాల్ సొంత సీట్ లోనే ఓడిపోతాడంటూ నేను గతంలో సవాల్ చేశాను. నేను చెప్పినట్టే ఇప్పుడు జరిగింది. మీ అహంకారమే మీ అధికారాన్ని దూరం చేసిందని సుఖేష్ రాసుకొచ్చాడు.
కేజ్రీవాల్ కు నిజాయితీ ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని.. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ముందు ఉంటాయని సుఖేష్ చెప్పాడు. మీ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతోనే తాను జైల్లో నుంచి పోటీ చేయలేదన్నాడు సుఖేష్. బీజేపీ పార్టీనే ప్రజలు నమ్ముతున్నారని.. మోడీ మీద విశ్వాసంతోనే ఓట్లేశారంటూ చెప్పుకొచ్చాడు. ఆప్ పార్టీ అవినీతిని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటానంటూ సుఖేష్ హెచ్చరించాడు.