– ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు
– నేటితో కవిత కస్టడీ పూర్తి
– సమీర్ మహేంద్రు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నలు
– సౌత్ గ్రూప్ ముడుపుల చెల్లింపులపై ఆరా
– ఇతరుల వాంగ్మూలాలనూ కవిత ముందు ఉంచిన ఈడీ
– మేక శరణ్ పాత్రపైనా ప్రశ్నల వర్షం
– కవిత కస్టడీ పొడిగింపు ఆలోచనలో అధికారులు
Suffocating, ED Questions Rained Down : ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో ఈడీ మరింత దూకుడు పెంచింది. కేసులో కేజ్రీవాల్ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావాల్సిన అన్నిరకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను మమ్మురం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం కవిత, కేజ్రీవాల్ను ఈడీ విచారించింది. ఇవాళ్టితో కవిత కస్టడీ ముగుస్తుండడంతో ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ముఖ్యంగా వంద కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా చేసిన ముడుపుల చెల్లింపులపై కీలక సమాచారాన్ని కవిత ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది.
వివిధ మార్గాల ద్వారా పంపిన ముడుపులను ఎన్నికల్లో ఆప్ వినియోగించిన తీరు, అందులో కవిత పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసులోని ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను కవిత ముందు పెట్టి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. పాలసీలో ఇండో స్పిరిట్కు అత్యధిక లాభాలు వచ్చేలా చూడడంతో పాటు, హోల్సేల్ వ్యాపారి లాభాల మార్జిన్ను 12 శాతానికి పెంచి, అందులో కొంత ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా కవిత పోషించిన పాత్రపై ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలలో కవిత ఆడపడుచు కుమారుడు మేక శరణ్ పోషించిన పాత్రపైనా ఈడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది. కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న మేక శరణ్ ఫోన్లో గుర్తించిన సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారంపై ప్రశ్నించినట్లు సమాచారం. శరణ్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై వారు పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం.
Read Also : పాన్ ఇండియా ట్యాపింగ్..!
కవిత వైపు నుంచే కాకుండా.. లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రు వైపు నుంచి కూడా మేక శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆదివారం సమీర్ మహేంద్రును విచారించారు అధికారులు. అతను చెప్పిన వివరాలను బట్టి, కవిత, కేజ్రీవాల్ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే, శరణ్ పాత్రపై అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులుతో కలిపి విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. నిజామాబాద్లో కవిత వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన అక్రమార్జనను కవిత నిజామాబాద్లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ విశ్వసిస్తోంది. ఈ మేరకే నిజామాబాద్లో కవిత వ్యవహారాలకు సంబంధించి ఆమె అనుచరులను విచారించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.