PM Modi: ప్రపంచమంతా భారత్ (India) పట్ల ఎంతో ఆశాభావంతో ఉందని, మన దేశానికి ఇది అద్భుతమైన అవకాశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. సామాన్యులు, ఆర్థిక విధానాల రూపకల్పన నిపుణులు, వేర్వేరు దేశాలు లేదా, ఇన్స్టిట్యూషన్లు భారత్పై ఈ స్థాయిలో ఆశలు పెట్టుకోవడం దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కొనసాగే ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతూనే ఉంటుందంటూ కొన్ని రోజులక్రితం ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్యానించడం ఇందుకు చక్కటి ఉదాహరణ అని మోదీ ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థపై గత కొన్ని వారాలుగా ఈ తరహా సానుకూల వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయని గుర్తుచేశారు.
18 పాలసీల ఆవిష్కరణ
‘ప్రపంచ భవిష్యత్ భారతదేశమే’ అంటూ ఐరాస విభాగమైన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) ప్రతినిధి అన్నారని ప్రస్తావించారు. మిగతా దేశాలు మాటలకే పరిమితం అవుతాయని, కానీ భారత్ మాత్రం ఫలితాలు చూపిస్తోందంటూ ఓఈసీడీ చెప్పిందని మోదీ గుర్తుచేశారు. భారత్ మాటలకే పరిమితం కాబోదని, చేతల్లో చూపిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో భోపాల్లో ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025’ను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలకు సంబంధించిన 18 పాలసీలను ఆయన ఆవిష్కరించారు. పారిశ్రామికరంగం, స్టార్టప్స్తో పాటు పలు రంగాలకు వర్తించేలా ఈ విధానాలు రూపకల్పన చేశారు. ఏరోస్పేస్ సంస్థలకు భారత్ ఒక అగ్రగామి సరఫరాదారుగా పరిణమిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అనేకమంది పెట్టుబడులు ఈ సదస్సుకు విచ్చేశారని, ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు.
బీజేపీ పాలనలో సుపరిపాలన
మధ్యప్రదేశ్ను త్వరలోనే పెట్టుబడుల హబ్గా తీర్చిదిద్దుతామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్ నుంచి అభివృద్ధి చెందిన భారత్’గా అవతరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. జనాభా పరంగా చూస్తే మధ్యప్రదేశ్ దేశంలో 5వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందని అన్నారు. బీజేపీ సారధ్యంలోని ఇక్కడి గవర్నమెంట్ సుపరిపాలనపై దృష్టి కేంద్రీకరించిందని ఇన్వెస్టర్లకు సూచించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ నాదిర్ గోద్రెజ్తో పాటు పలువురు ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, బిజినెస్మెన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. విదేశాలకు చెందిన ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నన్ను క్షమించండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ ఇన్వె్స్టర్స్ సమ్మిట్లో పాల్గొనాల్సిన సమయం కంటే 15-20 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అందుకు, క్షమించాలని ప్రధానమంత్రి కోరారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని, అయితే ఆలస్యంగా రావడానికి ఒక కారణం ఉందని చెప్పారు. ఇక్కడ (భోపాల్) 10, 12వ తరగతుల విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని, ఈ పరీక్ష మొదలయ్యే సమయం, తాను రాజ్భవన్ నుంచి బయలుదేరే సమయం ఒకటేనని మోదీ వెల్లడించారు. ఆ సమయంలో తాను బయలుదేరితే భద్రతా కారణాల రీత్యా రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావొచ్చని, పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చని, అందుకే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లిపోయాక రాజ్భవన్ నుంచి బయలుదేరానని మోదీ వెల్లడించారు.
Read Also: MLC Elections: కౌన్ బనేగా ఎమ్మెల్యే కోటా ‘ఎమ్మెల్సీ’.. ఆశావహుల లిస్ట్ పెద్దదే!