Odisha : ఒడిశాలో మహాదారుం చోటు చేసుకుంది. మూఢ నమ్మకాల పేరుతో నెల రోజుల పసిబిడ్డకు ఏకంగా 40 వాతలు పెట్టించారు కుటుంబీకులు. పెద్ద వారికి ఒక్క వాత పెడితే కూడా తట్టుకోలేరు. అలాంటిది అంత చిన్న పసిబిడ్డకు ఇన్ని వాతలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వాతలు పెట్టారనే విషయం తెలియడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఒడిశాలోని నరంగాపూర్ జిల్లాలోని గంభరిగూడ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది.
గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన నెల రోజుల వయసున్న పసిబిడ్డకు వారం రోజులుగా తీవ్ర జ్వరం వస్తోంది. కుటుంబ సభ్యులు కొన్ని ఆస్పత్రుల్లో చూపించినా సరే తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీంతో వాళ్లకు తెలిసిన వాళ్ల ద్వారా మూఢనమ్మకం వైపు వెళ్లారు. చిన్నారికి ఇనుప కడ్డీతో కాల్చితే ఎలాంటి జ్వరం అయినా తగ్గుతుందని కందరు చెప్పడంతో శిశువుకి 40 వాతలు పెట్టారు. జ్వరంతో ఉన్నప్పుడే ఇలా వాతలు పెట్టడంతో చిన్నారి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామస్తులకు తెలిసింది. వెంటనే గ్రామ పంచాయతీ సిబంది వచ్చి చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నారి శరీరంపై వేడి లోహంతో 40 చోట్ల ముద్రలు వేశారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వైద్యాధికారులు ఆ చిన్నారిని పరిశీలించి ఉత్తమ వైద్యం కోసం పెద్దాస్పత్రికి తరలించారు.