V2V Technology: రోడ్డు ప్రమాదాలు పెద్దసవాలుగా మారిపోయిన విషయం తెలిసిందే. అనునిత్యం జరుగుతున్న యాక్సిడెంట్లలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ విభాగాలు తమవంతు కృషి చేస్తున్నా, ఆశించిన ఫలితాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెహికిల్ టు వెహికిల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని (V2V Technology) అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) శుక్రవారం నాడు ప్రకటించారు. వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకునే అవకాశం తగ్గుతుందన్నారు. ఫలితంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా (Road Accident) తగ్గుతాయని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వాహనం మరో వాహనంతో నేరుగా కమ్యూనికేట్ కావొచ్చని, డ్రైవర్లకు ఆటోమేటిక్ అలర్ట్స్ జారీ అవుతాయని వివరించారు. ఈ టెక్నాలజీ ఇప్పటికే పలు దేశాలలో ఉందని తెలిపారు. మొబైల్, లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే సేఫ్టీ అలర్ట్స్ జారీ చేసేందుకు వీలుంటుందని వివరించారు.
ముందు, పక్కన, వెనుకాల ఇలాంటి అన్ని దిశల్లో ఉండే వాహనాల విషయంలోనూ వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ పనిచేస్తుందని వివరించారు. రోడ్లు సరిగా లేనప్పుడు, గుంతల మయంగా ఉన్నప్పుడు కూడా అలర్ట్స్ వస్తాయని పేర్కొన్నారు. డ్రైవర్ పొరపాటున లైన్ క్రాస్ చేసినా అలర్ట్ జారీ చేస్తుందని నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ టెక్నాలజీ కార్లలో ఏడీఏఎస్లో (Advanced Driver Assistance Systems) భాగంగా ఉంటుందన్నారు.
రేటు ఎంతో తెలుసా?
వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ ధర ఒక్కో వాహనానికి రూ.5000 నుంచి రూ.7000 వరకు ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రమాణాలు, నిబంధనలను మంత్రిత్వ శాఖ ఖరారు చేసే పనిలో ఉందని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని, కొత్త వాహనాలు అన్నింటికీ ఈ టెక్నాలజీ తప్పనిసరి అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సహకరించనుంది. నేషనల్ ఫ్రీక్వెన్సీ అలకేషన్ ప్లాన్ కింద ఉచితంగా స్పెక్ట్రమ్ అందించనుంది. కాబట్టి, వాహన తయారీదారులు వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం అదనంగా డబ్బులు తీసుకోరని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ సంవత్సరంలోనే ఈ టెక్నాలజీని అమలులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.
కాగా, కార్లలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ టెక్నాలజీలో 30 MHz (మిలియన్ హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీని ఉపయోగించి, నిర్దేశిత వాహనం చుట్టుపక్కల ఉండే ఇతర వాహనాల కదలికలను గుర్తిస్తారు. నిర్దేశిత ఫ్రీక్వెన్సీ పరిధిలోకి ఇతర ఏ వాహనం వచ్చినా అలర్ట్ వెలువడుతుంది. ఎంత దూరంలో కదలాడుతున్నాయి, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో కూడా గుర్తించవచ్చు. కాబట్టి, రోడ్డు ప్రమాదాల నివారణలో ఒక కీలక ముందడుగా నిలువబోతోంది. ప్రస్తుతం కార్లలోని సెన్సార్ టెక్నాలజీ ద్వారా ఇతర వెహికిల్స్ను గుర్తించే వీలుంది. అయితే, అలర్ట్స్ జారీ చేసే అవకాశం మాత్రం లేదు. వీ2వీ టెక్నాలజీ ఆ సమస్యకు చెక్ పెడుతుంది.

