Mumbai Blasts: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో (Mumbai Blasts) సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషులుగా ఉన్న 12 మంది నిర్దోషులంటూ ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు మహారాష్ట్ర క్రిమినల్ నియంత్రణ చట్టం (MCOCA) కింద విచారణలో ఉన్న ఇతర కేసులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన అనంతరం జస్టిస్ ఎంఎం. సుంద్రేశ్, ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అయితే, ఖైదీలు జైలు నుంచి విడుదల కావడంపై అభ్యంతరం చెప్పడం లేదని, ఇప్పటికే విడుదలైనవారిని జైలుకు పంపించొద్దని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వాదనపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆ 12 మంది నిందితులకు నోటీసులు జారీ చేశారు. ‘‘బాంబే హైకోర్టు తీర్పును న్యాయ వ్యవస్థలో ఒక ఉదాహరణగా పరిగణించవద్దని కోరుతున్నాం. ఆ తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని ఉత్తర్వులో బెంచ్ వ్యాఖ్యానించింది.
Read Also- Vijay Deverakonda: గుడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. మరో రెండు రోజుల్లో మీ ముందుకు..!
మహారాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటి?
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘‘ఖైదీల విడుదలను వెంటనే ఆపాలని కోరడం లేదు. కానీ, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు మహారాష్ట్ర క్రిమినల్ నియంత్రణ చట్టం కింద విచారిస్తున్న మరికొన్ని కేసులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే ఆ తీర్పును నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న బెంచ్, “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బాంబే హైకోర్టు తీర్పును న్యాయ ఉదాహరణగా పరిగణించబడదు” అని స్పష్టం చేసింది. ముంబై పేలుళ్లలో కేసులో ఆ 12 మంది దోషులంటూ మహారాష్ట్ర క్రిమినల్ నియంత్రణ చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రయల్ కోర్టు 2015లో ఇచ్చిన తీర్పును జులై 21 బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఆ 12 మంది నిర్దోషులంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Read Also- Pawan Kalyan: హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
ట్రయల్ కోర్టు తీర్పు కొట్టేసిన బాంబే హైకోర్టు
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా బాంబే హైకోర్టు జులై 21న తోసిపుచ్చింది. నిందిత వ్యక్తులంతా దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమయ్యారని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చండక్లతో కూడిన బాంబే హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కేవలం అభియోగాల ఆధారంగా నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టమేనని, అందుకే వారికి విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇతర కేసుల్లో వాంటెడ్గా లేకుంటే నిందితులందరినీ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ముంబై లోకల్ ట్రైన్ బాంబు పేలుళ్ల కేసులో ఆధారంగా చూపిన సాక్ష్యాలు సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. బాంబు పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఎవరైనా నిందితులను గుర్తుపట్టగలరా? అనే జడ్జిలు ప్రశ్నించారు. కేసు తదుపరి విచారణలో గుర్తించిన బాంబులు, పిస్తోళ్లు, మ్యాపులు ఇవేమీ పేలుళ్లకు సంబంధం లేనివని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పైగా, రైళ్లలో పేలుళ్లకు ఏ రకమైన బాంబులను ఉపయోగించారో కూడా ప్రభుత్వం నిర్ధారించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
పేలుళ్లు ఎప్పుడు జరిగాయి?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై ట్రైన్ బాంబు పేలుళ్లు 2006 జూలై 11న సాయంత్రం 6.24 గంటల నుంచి 6.35 గంటల మధ్య సమయంలో జరిగాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలో వేర్వేరు లోకల్ ట్రైన్లలో ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చి గేట్ నుంచి వెళ్లిన ట్రైన్లలో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లలో ప్రెషర్ కుకర్లలో బాంబులను అమర్చారు. సాధారణ పౌరులు, ఉద్యోగులు పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే రద్దీ సమయంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు. మటుంగా రోడ్, మహిమ్ జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బోరివలి స్టేషన్లకు సమీపంలో బాంబులను పేల్చివేశారు. తొలి పేలుడు 6.24 గంటల సమయంలో జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2015లో 12 మంది దోషులుగా ప్రకటించింది. ఫైసల్ షేక్, ఆసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఎహ్తెషాం సిద్దికీ, నవీద్ ఖాన్లకు మరణశిక్ష విధిస్తూ ‘ది స్పెషల్ కోర్టు ఆఫ్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్’ తీర్పునిచ్చింది. పేలుళ్ల కుట్రలో భాగస్వాములుగా ఉన్న మిగతా ఏడుగురు నిందితులైన మహ్మద్ సాజిద్ అన్సారీ, మొహమ్మద్ అలీ, డాక్టర్ తన్వీర్ అన్సారీ, మజీద్ షఫీ, ముజమ్మిల్ షేక్, సోహైల్ షేక్, జమీర్ షేక్లకు జీవిత ఖైదు విధించింది.