Reliance ONGC Dispute: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అపర కుబేరుడైన ముకేశ్ అంబానీకి కేంద్రంలోని మోదీ సర్కార్ గట్టి షాకిచ్చింది. భారత ప్రభుత్వం ఆయన కంపెనీకి $2.81 బిలియన్ల (సుమారు రూ. 24,522 కోట్లు) డిమాండ్ నోటీసులను పంపింది. ఈ నోటీసును పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
రిలయన్స్ చేసిన తప్పు ఏంటంటే?
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ దాని భాగస్వాములు బ్రిటీష్ పెట్రోలియం, జపాన్కు చెందిన నికో సంస్థలు సంయుక్తంగా గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి పక్కనే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పాదక దిగ్గజం ఓఎన్జీసీ (ONGC)కి చెందిన చమురు క్షేత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాస్ ను రిలయన్స్ దాని భాగస్వామ్య సంస్థలు వెలికి తీసి అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు సైతం చేయలేదని అభియోగాలు మోపబడ్డాయి.
2016లోనే చర్యలు చేపట్టిన కేంద్రం
ఓఎన్జీసీకి చెందిన చమురు అక్రమ వినియోగంపై 2016లోనే మోదీ ప్రభుత్వం చర్యలకు దిగింది. 1.55 బిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లోనే రిలయన్స్ ఇండస్ట్రీకి నోటీసులు పంపింది. అయితే దీనిని సవాలు చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని భాగస్వామ్య కంపెనీలైనా బ్రిటీష్ పెట్రోలియం, నికో సంస్థలు.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కు వెళ్లాయి. దీనిపై విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.
హైకోర్టుకు వెళ్లిన కేంద్రం
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్రంలోని మోదీ సర్కార్.. 2023 మేలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం అప్పీల్ పై తొలుత సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఆ బెంచ్ కూడా ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో కేంద్రం.. డివిజన్ బెంచ్ ను అప్పీల్ చేసుకోగా అది సింగిల్ జడ్జి ఉత్తర్వులను పక్కన పెట్టింది. గత నెల ఫిబ్రవరి 24న రిలయన్స్ దాని భాగస్వాములకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో తమతో పాటు భాగస్వామ్య కంపెనీలకు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసు కేంద్రం పంపినట్టు స్టాక్ ఎక్సేంజీలకు రిలయన్స్ తాజాగా తెలిపింది.
మరో విషయంలోనూ జరిమానా
మరోవైపు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సైతం ముకేష్ అంబానీకి షాకిచ్చింది. రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్ కు రూ.3.1 కోట్లు జరిమానా విధించింది. 10 గిగా వాట్ పవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికి గానూ ఈ పెనాల్టీ విధించింది. అటు ప్రభుత్వం పంపిన డిమాండ్ నోటీసుతో ఇవాళ రిలయన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 1 శాతం క్షీణతతో ట్రేడవుతున్నాయి.