Modi cabinet takes six ex cm members as central ministers:
మూడోసారి హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోదీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 71 మంది మంత్రులతో కూడిన మండలిలోకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సారి ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర క్యాబినెట్ లో చోటు సంపాదించారు. 30 మంది మంత్రులతో కూడిన కేంద్ర క్యాబినెట్ లో మూడు సార్లు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కూడా మోడీ మంత్రివర్గంలో చేరారు. వీరిద్దరూ ఆయా రాష్ట్రాలకు స్వల్పకాలమే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరంతా కూడా ప్రధాని మోదీతో సహా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రధాని కాకముందు నరేంద్ర మోదీ కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు.
మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సీఎంలు
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కు బీజేపీ నుంచి సీఎంగా పని చేసిన రాజ్ నాథ్ సింగ్కు మంత్రి పదవి లభించింది. గతంలో వాజపేయి ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన రాజ్ నాథ్ సింగ్.. మోదీ తొలి ప్రభుత్వంలో హోంమంత్రిగా, మోదీ 2.0లో రక్షణ మంత్రిగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విదిశ స్థానం నుంచి ఎన్నికయ్యారు. హర్యానా నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మనోహర్ లాల్ ఖట్టర్.. 2014 నుంచి ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు వరకూ హర్యానా సీఎంగా పని చేశారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడు, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి కూడా మోదీ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు. 2008లో తొలుత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి.. 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎంగా రెండోసారి పని చేశారు. బీహార్కు చెందిన జీతన్ రామ్ మాంఝీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. 2014 ఎన్నికల్లో జేడీయూ బీహార్ నుంచి ఓటమి పాలవ్వడంతో సీఎంగా రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. జీతన్ రాం మాంఝీని సీఎంను చేశారు. కానీ 2015లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మాంఝీని తప్పించారు. ఆ వెంటనే హిందూస్థాన్ అవామీ మోర్చా అనే పార్టీని స్థాపించిన మాంఝీ.. ఎన్డీఏలో భాగస్వామిగా చేశారు. మోదీ మంత్రి వర్గంలో ప్రమాణం చేసిన సర్బానంద్ సోనోవాల్ 2014లో తొలిసారి కేంద్ర మంత్రిగా చేరారు. 2016లో జరిగిన అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్ర క్యాబినెట్ పదవికి రాజీనామా చేసి అసోం సీఎంగా ప్రమాణం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత హిమంత బిశ్వ శర్మ.. అసోం సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో తిరిగి సోనోవాల్ కేంద్ర మంత్రి వర్గంలో చేరారు.
శాఖలపై అనుభవం, పట్టు
31 మంది కేబినెట్ మంత్రులతో పాటు ప్రధాని మోదీ కొత్త బృందంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన ఐదుగురు సహాయ మంత్రులు, 35 మంది జూనియర్ మంత్రులు ఉన్నారు. కౌన్సిల్లో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వారిని మోదీ కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వారికి అన్ని శాఖల మీద పాలన అనుభవం ఉంటుంది అటువంటి వారిని కేంద్ర మంత్రివర్గంలో కి తీసుకుంటే వారి పాలన అనుభవం కేంద్రంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.