Mock Drills: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ దాడి చేస్తే ప్రతిదాడికి తాము సిద్ధమంటూ పాక్ సైతం కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రస్తుతం దేశంలో నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజా పరిణామాల దృష్ట్యా కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేపు మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించాలని ఆదేశించింది.
రేపు జరిగేవి ఇవే!
యుద్ధం వస్తే ప్రజల సంరక్షణకు సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రాక్టీస్ చేయనున్నారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మే 6న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. కశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రాత్రిపూట ఉన్నట్టుండి పట్టణాల్లో లైట్లు ఆఫ్ చేయడం, వైమానిక దాడి హెచ్చరికలకు సంబంధించిన సైరన్లు మోగించడం, యుద్ధ సూచనలు చేయడం వంటివి ఈ మాక్ డ్రిల్స్ లో చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో 4 చోట్ల డ్రిల్
ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను మూడు కేటగిరీలుగా కేంద్ర హోంశాఖ విభజించింది. రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు ఉండే ఢిల్లీ ప్రాంతాన్ని కేటగిరి – 1లో చేర్చింది. అలాగే ఎంతో ప్రమాదకరమైన తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం సైతం మెుదటి కేటగిరిలో ఉంది. రెండో కేటగిరిలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలను చేర్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నాలుగు ఏరియాల్లో రేపు మాక్ డ్రిల్స్ కంచన్బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీ, సికింద్రాబాద్, గోల్కొండలో సాయంత్రం 4 గంటలకు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
54 ఏళ్ల తర్వాత మళ్లీ
దేశంలో ఈ తరహా మాక్ డ్రిల్స్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ నిర్వహించారు. 1971లో బంగ్లాదేశ్ కోసం పాక్ తో యుద్ధం సందర్భంగా ఈ మాక్ డ్రిల్ జరిగింది. అంతకుముందు చైనాతో 1962, 65 యుద్ధాల సమయంలోనూ ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ తరహా డ్రిల్స్ నిర్వహించారు. అయితే 1971 తర్వాత అంటే దాదాపు 54 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మళ్లీ ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పాక్ తో యుద్ధానికి కేంద్రం సిద్ధమైందా? అన్న అనుమానాలు అందరిలోనూ పెరిగిపోయాయి.
Also Read: KTR on CM Revanth: చేతకాకుంటే తప్పుకో.. దివాలా మాటలు వద్దు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం
మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారు?
శత్రు దేశం నుంచి యుద్ధ విమానాలు, క్షిపణులు దూసుకొస్తున్న సమయంలో ప్రజలు ఎలా సన్నద్ధంగా ఉండాలో తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. అలాగే సైన్యం సన్నద్ధతను ఈ డ్రిల్స్ మెరుగు పరుస్తాయి. కఠిన పరిస్థితులను పౌరులు, విద్యార్థుల ఏ విధంగా ఎదుర్కొవాలి? వాటి నుంచి ఎలా బయటపడాలి? వంటి వాటిపై ఈ డ్రిల్స్ ద్వారా అవగాహన రానుంది.