లక్నో, స్వేచ్ఛ: ‘‘మహా కుంభమేళా అంటే నాకు గౌరవం. గంగా నది మాత అంటే గౌరవం. కానీ ఎలాంటి ప్లానింగ్ లేకుండా మృత్యుకుంభగా మార్చివేశారు. నదిలో ఎంతమంది శవాలు దొరికాయి?. మలవ్యవర్థాల బ్యాక్టీరియాతో నీళ్లు కలుషితం అయిపోయాయి’’ అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆధిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. త్రివేణి సంగమం, గంగా నదిలో మల బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సంగమం వద్ద స్నానం ఆచరించడమే కాదు, నీళ్లు తాగేందుకు కూడా అనువుగా ఉన్నాయని చెప్పారు. సనాతన ధర్మంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని యోగి మండిపడ్డారు. ఫేక్ వీడియోలను వైరల్గా మార్చి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దురుద్దేశంతో ఈ ప్రచారం చేస్తున్నారని ఖండించారు. ప్రయాగ్రాజ్లో గంగా మాత చెంత జరుగుతున్న మహా కుంభమేళపై ఈ తరహా ప్రచారం చేయడమంటే ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించిన కోట్లాది మందిని అవమానించడమేనని, వారి విశ్వాసంతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. వైభవోపేతంగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించారు. మహా కుంభమేళా రాజకీయ ఈవెంట్ కాదని అన్నారు. కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు నుంచి దుష్ప్రచారం చేస్తు్న్నారని, అన్ని అవాంతరాలను దాటుకొని విజయవంతంగా ఈ కార్యక్రమం దాదాపు ముగింపు దశకు వచ్చిందని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారాలు పక్కనపెట్టి ఈ దేశం మహా కుంభమేళాలో పాల్గొంటోందని ఆయన సీఎం యోగిఆధిత్యనాథ్ పేర్కొన్నారు.
శుద్ధి చేశాకే నీటి విడుదల
త్రివేణి సంగమం, చుట్టుపక్కల ఉన్న అన్ని పైపులు, డ్రెయినేజీ వ్యవస్థలను నిలిపివేశామని, నీటిని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నీటి నాణ్యత నిర్ధారణ కోసం ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందని వివరించింది. నీటిలో మలబ్యాక్టరీయా స్థాయి పెరుగుదలకు పలు కారణాలు ఉండవచ్చని, మురుగు నీటి లీకేజీ, జంతు వ్యవర్థాల వంటికి కారణాలు కావొచ్చని ఆయన వివరించారు. ఈ మేరకు బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘మహా కుంభమేళా ఘట్టాన్ని రాజకీయ పార్టీలు లేదా ఆర్గనైజేషన్లు నిర్వహించడం లేదు. మహా కుంభమేళా సమాజానికి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. బాధ్యతలు నెరవేర్చే ఒక సర్వేంట్గా ప్రభుత్వం వ్యహరిస్తుంది. శతాబ్దకాలంలో ఒకసారి జరిగే ఈ ఘట్టాన్ని నిర్వహించే అవకాశం దక్కడం మా ప్రభుత్వ అదృష్టం. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది పాల్గొని ఈ స్నానఘట్టం విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. దుష్ప్రచారాలను మేము పట్టించుకోబోం’’ అని యూపీ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మహాకుంభ మేళా షురూ అయింది. ఈ 26 వరకు ఈ మహా స్నానఘట్టం కొనసాగనుంది. మొత్తం 46 రోజుల వ్యవధిలో మొత్తం 45 మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేయగా, ముగింపునకు మరో వారం రోజులు మిగిలివుండగానే ఇప్పటికే అంచనాకు మించి 56 కోట్ల మంది భక్తులు స్నానమాచరించడం గమనార్హం.