CPM Party: తమిళనాడులోని మధురైలో నిర్వహించిన 24వ సీపీఎం జాతీయ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. గతేడాది సీతారాం ఏచూరి మృతి అనంతరం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వ్యవహరించారు.
ఈ మహా సభలో 85 మంది సభ్యులతో పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకుంది. నూతన కేంద్ర కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబిని ఎన్నకున్నారు. 18 మందితో నూతన కొత్త పొలిట్ బ్యూరోను ఎన్నుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా బీవీ రాఘవులు, ఆర్.అరుణ్ కుమార్ ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీలోనూ తొమ్మిదిమందికి చోటు దక్కింది. కేంద్రకమిటీ మెంబర్ గా కె. హేమలత, జాన్ వెస్లీ, ఎస్.వీరయ్య, ఎం.సాయిబాబా, టి.జ్యోతి, తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు, లోకనాధం, రమాదేవి ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు.
Also read: BRS Party: సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ డైలమా? బీఆర్ఎస్ సభ అనుమతి వచ్చేనా?
ఎంఏ బేబీ ప్రస్థానం..
కేరళలోని కొల్లాం జిల్లా ప్రక్కులాంలో ఎంఏ బేబీ జన్మించారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత పార్టీ యూత్ వింగ్ డీవైఎఫ్ఐలో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులను, యువతను సమీకరించి జైలుశిక్ష కూడా అనుభవించారు.
2006లో కేరళలోని కుందర నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2006 నుంచి 2011 వరకు వీఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కుందర నియోజకవర్గం నుంచే తిరిగి గెలుపొందారు. 2012 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. కాగా, 2014 లోక్సభ ఎన్నికల్లో కొల్లాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంచెలంచెలుగా జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.