Toll Plazas: దేశంలో ఇప్పటివరకు ఉన్న టోల్ ప్లాజాల సిస్టమ్ ఇక చాలావరకూ ముగియబోతోందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గురువారం లోక్సభలో మాట్లాడిన ఆయన, “మరో ఏడాదిలో టోల్ పేరిట ఎక్కడా వాహనాలను ఆపరని కొత్త ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ దేశంలో పూర్తిగా అమలు అవుతుంది” అని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీని ట్రయల్గా ప్రారంభించారని, త్వరలో అన్ని హైవేలపై అమలు చేస్తామని చెప్పారు. “టోల్ పేరిట ఎవరూ మిమ్మల్ని ఆపరు. పూర్తిగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్కి మారిపోతాం” అని గడ్కరీ చెప్పారు.
టోల్ వద్ద ట్రాఫిక్కు చెక్.. కొత్త టెక్నాలజీ రాబోతోంది
రాతపూర్వక సమాధానంలో గడ్కరీ, టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్, లైన్లు, ఆలస్యాలు పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకురాబోతోందని చెప్పారు. “వాహనాలు ఎక్కడా ఆగకుండా సజావుగా వెళ్లేలా Multi-Lane Free Flow Electronic Toll System తీసుకొస్తున్నాం. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), AI అనలిటిక్స్, RFID ఆధారిత FASTag వంటి టెక్నాలజీలు కలిపి వాడతాం” అని తెలిపారు.
FASTag + ANPR = ఇక బారియర్ లేదు
NPCI ఇప్పటికే దేశవ్యాప్తంగా టోల్ కలెక్షన్ను ఒకే విధంగా చేసేందుకు NETC (National Electronic Toll Collection) సిస్టమ్ను రూపొందించింది. FASTagని వాహనం గాజుకు అంటిస్తే, టోల్ గేట్ల వద్ద ఆగకుండా ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది. మరి ఇప్పుడు, FASTagకి తోడు AI–ఆధారిత ANPR టెక్నాలజీని కూడా జత చేసి పూర్తిగా బారియర్-లేని టోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిస్టమ్ను కొన్ని టోల్ ప్లాజాల్లో అమలు చేయడానికి ఇప్పటికే ప్రపోజల్స్ తీసుకున్నారని, ఫలితాల ఆధారంగా మరో దశలో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వివరించారు.
దేశంలో భారీ స్థాయిలో రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ₹10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని గడ్కరీ తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ రహదారి వ్యవస్థ పూర్తిగా మారబోతుందన్నారు.

