• 18 మంది మృతి.. 10 మందికి గాయాలు
• మహా కుంభమేళా వెళ్లేందుకు పోటెత్తిన జనం
• రెండు ప్లాట్ఫామ్ల దగ్గర తొక్కిసలాట
• ప్రధాని మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్ దిగ్ర్భాంతి
• ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు
న్యూఢిల్లీ, స్వేచ్ఛ: మహా కుంభమేళాలో ఈమధ్యే భారీ తొక్కిసలాట జరిగింది. ఆ విషాద ఛాయలు మరిచిపోకముందే కుంభమేళాకు వెళ్లే 18 మంది భక్తులు తాజాగా తొక్కిసలాటలో చనిపోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో మహా కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు భారీగా స్టేషన్కు వచ్చారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లకు 13, 14 ప్లాట్ ఫామ్లు కేటాయించారు. ఆ రెండు చోట్ల భక్తుల రద్దీ బాగా కనిపించింది.
ఈ క్రమంలోనే ప్లాట్ ఫామ్ 14 దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. ప్లాట్ ఫామ్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర కూడా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనల్లో 18 మంది చనిపోగా, 10 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు సమాచారం. కేంద్రం, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాయని మాజీ సీఎం అతిశీ విమర్శించారు.