న్యూఢిల్లీ, స్వేచ్ఛ: తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని, తొలి కేబినెట్ భేటీలోనే దీనికి ఆమోదముద్ర వేస్తామంటూ హామీ ఇచ్చి బీజేపీ మాట తప్పిందని మాజీ సీఎం అతిశీ చేసిన విమర్శలకు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా కౌంటర్లు ఇచ్చారు. ఒక్క రోజు పాలనకే బీజేపీ సర్కారుపై విమర్శలా చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆప్ అమలు చేయలేకపోయిందని, కాబట్టి, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వారికి లేదని ఆమె విమర్శించారు. ‘‘మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్లకు లేదు. ప్రస్తుతం మా ఆందోళనంతా ఢిల్లీ గురించే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీకి అన్ని హక్కులు దక్కుతాయి. ముందు వాళ్లు వారి పార్టీ గురించి చూసుకోవాలి. ఆ పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సభ ముందుకు రానున్న కాగ్ రిపోర్టుపై ఆ పార్టీ నేతలు గుబులు పడుతున్నారు. చాలా మంది నేతలకు సంబంధించిన రికార్డులు బయటపడతాయి’’ అని రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు, ఆప్ 13 ఏళ్లు పాలించాయని, అంతకాలం పాలించి ఏం చేశారో చూసుకోకుండా, అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా పూర్తవ్వకముందే విమర్శలు చేస్తారా? అని రేఖా గుప్తా ప్రశ్నించారు. తొలిరోజున జరిగిన కేబినెట్ భేటీలో ఆయుష్మాన్ భారత్ యోజన అమలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చామని, ఆప్ ప్రభుత్వం అడ్డుకున్న ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షల మేర వైద్యసాయం అందుతుందని వివరించారు. కాగా, గురువారం రాత్రి ఢిల్లీ నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ మంత్రులు వెళ్లి యమునా నదిని పరిశీలించారు. నదికి హారతులు ఇచ్చారు. అయితే, తొలి కేబినెట్ భేటీలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారని ఢిల్లీ ప్రజలు ఆశగా ఎదురుచూశారని, బీజేపీ సర్కారు వాగ్దానాన్ని తప్పిందని అతిశీ విమర్శించారు. ఢిల్లీ ప్రజలను ఆప్ మోసం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతిని కలిసిన రేఖా గుప్తా
ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని రాష్ట్రపతి కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ను కూడా రేఖా గుప్తా కలిశారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియెట్ ఫొటోని విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 27 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.