Liquor scam: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్కు సరిగ్గా పుట్టిన రోజు నాడు ఊహించని షాక్ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై శుక్రవారం ఆయనను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఇవాళ (జులై 18) ఉదయం చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్తగా లభ్యమైన ఆధారాల ఆధారంగా ఈడీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.
భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం 2019 నుంచి 2023 మధ్యకాలంలో జరిగిన సుమారు రూ.2,160 కోట్ల మద్యం కుంభకోణంలో చైతన్య బఘేల్కు సంబంధం ఉందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. చైతన్య అక్రమ లాభాల లబ్దిదారుగా ఉన్నట్టు సందేహాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మద్యాన్ని ట్యాక్స్లు, ఫీజులు చెల్లించకుండా నేరుగా డిస్టిల్లరీల నుంచి దుకాణాలకు సరఫరా చేశారని, ఇందుకోసం ప్రభుత్వానికి సమాంతరమైన ఒక వ్యవస్థను నడిపించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అక్రమ విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
Read Also- Team India: నాలుగో టెస్టుకు స్టార్ ప్లేయర్!.. సిద్ధమైన మేనేజ్మెంట్?
కాగా, చైతన్య బాఘెల్ అరెస్టుకు ముందు తన నివాసంలో ఈడీ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బఘేల్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఇద్దరూ తమ యజమానులను సంతోషపెట్టేందుకు ఈడీని పంపించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ఈడీ దాడులు చేసినా మేము భయపడబోం. భూపేష్ బఘేల్ తలవంచడు. సత్యం కోసం పోరాడుతాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు బీహార్లో ఓటర్ల పేర్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ భూపేష్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ, డీఆర్ఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్షాలను అణచివేయడానికి వాడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Read Also- Ind vs Eng Test: గంభీర్ గారూ.. అతడ్ని తీసేయండి సార్.. మాజీ క్రికెటర్ డిమాండ్!
ఎవరీ చైతన్య బాఘెల్?
చైతన్య బాఘేల్కు మాజీ సీఎం కొడుకు అయినప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల రాజకీయాల్లో అంత చురుకైన పాత్ర కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని కార్యక్రమాల్లో యువనేతగా అప్పుడప్పుడూ పాల్గొంటుంటారు.
వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. తాజాగా ఈడీ కేసు తర్వాత ఆయనపై అందరి దృష్టిపడింది. నిజానికి తండ్రికి రాజకీయ వారసుడిగా విశ్లేషణలు ఉన్నాయి. కానీ, అధికారికంగా పార్టీలో ఎలాంటి పదవులు లేవు. ఎన్నికల్లో పోటీకి దిగింది కూడా లేదు. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో చైతన్య బాఘేల్ పేరు రాజకీయంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దీంతో, ఆయనకు రాజకీయ, న్యాయపరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసు భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.