Grok AI Misuse: పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (X) తీసుకొచ్చిన గ్రోక్ ఏఐ ( Grok AI Misuse) దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని గ్రోక్ ఏఐ ద్వారా అసభ్యకరమైన, అశ్లీల, లైంగిక వేధింపులతో కూడిన కంటెంట్ను సృష్టించి షేర్ చేస్తున్నట్లుగా వస్తున్న కథనాలపై కేంద్రం సీరియస్గా స్పందించింది. గ్రోక్ ఏఐ ప్లాట్ఫామ్పై అసభ్యకరమైన కంటెంట్ నియంత్రణకు తీసుకున్న చర్యలు ఏమిటో 72 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ‘ఎక్స్ కార్పొరేషన్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వశాఖ శుక్రవారం నాడు నోటీసులు పంపించింది. ఐటీ చట్ట-2000, ఐటి రూల్స్-2021లోని చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలం కావడంతో ఈ నోటీసులు పంపించినట్టు స్పష్టం చేసింది.
72 గంటల్లో నివేదిక ఇవ్వాలి
తమ పంపించిన నోటీసుపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలని ఎక్స్ కార్ప్ను కేంద్రం ఆదేశించింది. చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ ఎలాంటి విధులు నిర్వహిస్తుంటారో చెప్పాలని, అలాగే, బీఎన్ఎస్ఎస్-2023 కింద తప్పనిసరి నివేదిక సమర్పించాలనే నిబంధన విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారని వివరించాలని స్పష్టం చేసింది. గ్రోక్ ఏఐ ఫీచర్లు, వాటి సామర్థ్యాలను ఉపయోగించుకొని మహిళలను అవమానపరిచే రీతిలో ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివాటికి అవకాశం కల్పిస్తే లైంగిక వేధింపులను సర్వసాధారణంగా మార్చివేస్తాయని, చట్టపరమైన ప్రొటెక్షన్ను బలహీనం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also- Xiaomi India Launch: భారత్ మార్కెట్లోకి Xiaomi 17, 17 Ultra, 17T.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?
రూల్స్ అతిక్రమించే అకౌంట్స్ తీసేయండి
అసభ్యకరమైన కంటెంట్ సృష్టించకుండా నియంత్రించాలని ఎక్స్ కార్ప్ను కేంద్రం కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం టెక్, పాలనాపరమైన వ్యవస్థలను సమగ్రంగా సమీక్షించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి కంటెంట్ క్రియేట్ చేస్తున్నవారి అకౌంట్లను నిలిపివేయాలని, లేదా తొలగించడం వంటి కఠినమైన విధానాలను అమలు చేయాలని సూటిగా చెప్పింది.
Read Also- GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు
భారతీయ చట్టాలకు నిబంధనలు పాటించని పక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే సేఫ్ హార్బర్ (రక్షణ) స్టేటస్ను కోల్పోవాల్సి ఉంటుందని ఎక్స్ను కేంద్రం హెచ్చరించింది. బీఎన్ఎస్ (BNS), మహిళల అసభ్య ప్రాతినిధ్య చట్టం, పోక్సో (POCSO) చట్టాల కింద శిక్షార్హమైన చర్యలను చవిచూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. కాగా, గ్రోక్ ఏఐని ఉపయోగించి అసభ్యకర, అశ్లీల కంటెంట్ ఏర్పాటు చేయడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మహిళల భద్రత దృష్ట్యా గ్రోక్లో మోనిటరింగ్ ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఎక్స్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైందని, నకిలీ ఖాతాలను సృష్టించి మహిళల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారంటూ ఆమె ప్రస్తావించారు. గ్రోక్ ఏఐ ఫీచర్ను ఉపయోగించి మహిళలను అశ్లీలంగా మార్చవేస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు రాసిన లేఖలో ప్రియాంక చతుర్వేది వివరించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే కేంద్రం స్పందించి, ఎక్స్కు నోటీసులు జారీ చేసింది.

