books destroyed but not knowledge says pm modi | పుస్తకాలను తగలబెట్టారు.. జ్ఞానాన్ని కాదు
Nalanda University
జాతీయం

Nalanda: పుస్తకాలను తగలబెట్టారు.. జ్ఞానాన్ని కాదు

– ఉనికిలోకి వచ్చిన డా. ఏపీజే అబ్దుల్ కలాం కలల ప్రాజెక్టు
– యూపీఏ సర్కారు చొరవతో నాడు పనులు ప్రారంభం
– ఇది ఆసియా ఉమ్మడి వారసత్వ సంపద
– నలంద వర్సిటీ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని

PM Modi: ఒకనాటి మేటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా పేరొందిన నలందా విశ్వవిద్యాలయం మళ్లీ ఉనికిలోకి వచ్చింది. బీహార్‌లోని రాజ్‌గిరిలో బుధవారం భారత ప్రధాని మోదీ చేతుల మీదగా ఈ ప్రాచీన విశ్వవిద్యాలయం కొత్తగా మరోసారి ఆకృతి దాల్చింది. 800 ఏళ్ల పాటు నిరంతరాయంగా విద్యా బోధన జరిగిన ఈ విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్దంలో ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఎవరైనా పుస్తకాలను తగలబెట్టగలరేమో గానీ జ్ఞానాన్ని కాదని, ఈ సత్యాన్ని ఈ నలందా విశ్వవిద్యాలయం చాటిచెబుతుందన్నారు. మూడోసారి ప్రధాని అయిన పది రోజులకే ఈ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవానికి రావటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. క్రీ. శ ఐదవ శతాబ్దం నుంచి 800 ఏళ్లపాటు అంతర్జాతీయ విద్యాసంస్థగా పేరొందిన ఈ వర్సిటీ మనదేశానికే గాక మొత్తం ఆసియాకు చెందిన ఉమ్మడి వారసత్వ సంపదగా ప్రధాని అభివర్ణించారు. అనేక దేశాలు ఈ యూనివర్సిటీ పునర్మిర్మాణంలో పాలుపంచుకున్నాయని ప్రధాని మోదీ వివరించారు. కొత్త క్యాంప‌స్‌కు వెళ్లటానికి ముందు ప్రధాని 2016లో యునెస్కో వార‌స‌త్వ క‌ట్టడంగా ప్రకటించిన న‌లంద మ‌హావీర‌ను సందర్శించి, అక్కడి ప్రాచీన కళాకృతులను పరిశీలించారు. ఈ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సీఎం నితీశ్ కుమార్, నలంద యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరవింద్ పనగారియాతోపాటు 17 దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు.

పునర్మిర్మాణం ఇలా..
2005లో నాటి భారత రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. నాటి యూపీఏ ప్రభుత్వపు చొరవతో 2007లో వర్సిటీ నిర్మాణం మొదలు కాగా, దీనికి ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించారు. జనవరి, 2007లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో, ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో జరిగిన నాల్గవ తూర్పు ఆసియా సదస్సులో నలంద విశ్వవిద్యాలయం పునః స్థాపన కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి భారత ప్రభుత్వం నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010ని రూపొందించింది. 2007లో ప్రాజెక్ట్ అమలు కోసం నలంద మెంటర్ గ్రూప్ (NMG) ఏర్పడింది. ఈ NMG పాలక మండలి వర్సిటీ విధులను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 1, 2014న పురాతన నలంద నుండి 10 కి.మీ దూరంలో ఉన్న బౌద్ధ యాత్రికుల పట్టణం రాజ్‌గిర్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లోని తాత్కాలిక వేదిక నుండి విద్యాబోధన మొదలైంది. 2017 నుండి నిర్మాణ పనులు ఊపందుకోగా, 6 పాఠశాలలు, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 1000 మంది చదువుకుంటున్నారు. అమెరికా, వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?