India Big Warning: పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నది. శనివారం సాయంత్రం ఉగ్రవాదులు, ఉగ్రమూకలకు మద్దతు పలికే వారికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా దేశంపై యుద్ధంగా పరిగణించాలని, దానికి తగువిధంగా స్పందించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇదొక కీలక నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతోపాటు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులను నిశితంగా చర్చించారు. పాక్, ఆ దేశం పెంచిపోషిస్తున్న ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత్.. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి.. ‘ ఏ ఉగ్ర చర్యనైనా దేశంపై యుద్ధమే’ అని భావించాల్సి ఉంటుందని నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ప్రధాని మోదీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాజా పరిణామాలు, పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్పై సుమారు గంటకు పైగా ప్రధానికి వివరించారు. ఈ భేటీ కంటే ముందు త్రివిధ దళాధిపతులతో కూడా దోవల్ భేటీ అయ్యారు.
సైరన్లు వద్దు..
మరోవైపు ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన వార్తలను ప్రాంతీయ, జాతీయ మీడియా పెద్ద ఎత్తున కవరేజీ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని ఛానెళ్లకు కేంద్రం సూచించింది. అంతేకాదు.. కేవలం మాక్ డ్రిల్ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని కేంద్రం సలహా ఇచ్చింది. ఎందుకంటే ఇలా తరచుగా ఈ సైరన్ శబ్దాలు ఉపయోగించడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో వీటిని మోగించినప్పుడు కూడా పౌరులు సైరన్లను తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం మీడియా ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతం..
పదే పదే పాకిస్థాన్.. భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది. ఏదో ఒక రీతిలో హడావుడి చేయడం, అలజడి సృష్టించడమే పనిగా పెట్టుకున్నది. దీంతో వీటన్నింటినీ సీరియస్గా తీసుకున్న భారత్.. మెరుపు దాడులకు దిగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 26/11 దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ముంబై దాడి సూత్రధారిని అబు జిందాల్ను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. పాక్, సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై దాడిలో ఐదుగురు టాప్ ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. ఇదంతా ఆపరేషన్ సింధూర్ దాడుల్లో భాగంగానే జరిగింది. ఇందులో ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు ఉన్నారు. మురిద్కే, బహవల్పూర్లో జరిగిన దాడిలో.. అబు జుందాల్, హఫీజ్ మహమ్మద్ జమీల్, మహ్మద్ యూసుఫ్ అజార్, అబు ఆకాష, మహమ్మద్ హసాన్ ఖాన్ హతమైనట్లు ఇండియన్ ప్రకటించింది.