CM Chandrababu: ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన అయోధ్యను (Ayodhya Ram Temple) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదివారం నాడు సందర్శించారు. అక్కడ కొలువైన బాల రామయ్యను ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. ‘‘అయోధ్యలో ఎంతో పవిత్రమైన, వైభవోపేతంగా విరాజిల్లుతున్న శ్రీరామ జన్మభూమి మందిరంలో రాములవారిని ఈ రోజు దర్శనం చేసుకొని, పూజలు చేసే భాగ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరోసారి, ఇక్కడికి రావడం ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక భావాన్ని మరింత ప్రసాదించింది. శ్రీరామచంద్రుడి విలువలు, ఆదర్శాలు ప్రతిఒక్కరికీ ఎప్పటికీ నిలిచిపోయే పాఠాలు. రాముడి విలువలు మనకు నిరంతరం ఒక మార్గదర్శకంగా, స్ఫూర్తిని నింపుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు పోస్ట్ పేర్కొన్నారు. కొన్ని ఫొటోలను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు. కాగా, అయోధ్య రామయ్యను సీఎం చంద్రబాబు గతంలో కూడా దర్శించుకున్నారు. 2024 జనవరి నెలలో జరిగిన శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Today, I was blessed to have darshan and offer prayers at the divine and magnificent Shri Ram Janmabhoomi Mandir in Ayodhya. It was a peaceful and spiritually uplifting experience to be here once again. Lord Shri Ram’s values and ideals are timeless lessons for us all. May they… pic.twitter.com/jM8ZMk8Cz3
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2025
పిన్నమనేని మృతిపై చంద్రబాబు విచారం
టీడీపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా మరణంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పిన్నమనేని మరణం విచారకరమని అన్నారు. దశాబ్దాలపాటు పార్టీకి అంకితభావంతో సాయిబాబా చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు. పిన్నమనేని సాయిబాబు మరణం తెలుగు దేశం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని అన్నారు. ఎప్పుడు పార్టీ ఆఫీస్కు వెళ్లినా ముందుగా ఎదురొచ్చి స్వాగతం పలికే సాయిబాబా దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, సాయిబాబా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు.
రతన్ టాటాకు నివాళి
భారతీయ పారిశ్రామిక దిగ్గజం, దివంగత రతన్ టాటా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘రతన్ టాటా జయంతి సందర్భంగా ఆయనను ఆత్మీయంగా స్మరించుకుంటున్నాను. ఒక దార్శనిక పారిశ్రామికవేత్తగా, మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిగా ఆయన తన జీవితాన్ని వ్యాపార రంగంలో రాణించడమే కాక, సమాజ సేవకు కూడా అంకితమయ్యారు. ఆయన వ్యక్తిత్వం, వినయం, సమాజం పట్ల నిబద్ధత మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే నిలుస్తాయి. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also- Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియోలో జాన్వీ కపూర్ ఫోటో.. సోషల్ మీడియా వార్..

