Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు (Tamilnadu) ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను గొప్ప ప్రాచీన భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నానని.. అందుకు తనను క్షమించాలన్నారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి, అటు తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద వివాదం నడుస్తోంది. మరీ ముఖ్యంగా భాష విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఇప్పటికే చాలా వాదనలు ఉన్నాయి. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని పాటించట్లేదని ఇటు తమిళనాడు ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది.
ఈ తరుణంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోయంబత్తూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ.. తమిళ భాష చాలా ప్రాచీనమైనదని.. దాన్ని తాము ఎప్పుడూ గౌరవిస్తామన్నారు. దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకేను తమిళ ప్రజలు ఓడించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో చాలా అరుదైన విజయాలు సాధించామన్నారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారని.. అటు ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో తమ ప్రభుత్వాల ఏర్పడ్డాయన్నారు.