- కల్తీసారా ఘటనలో 29 కి చేరిన మృతుల సంఖ్య
- గంటగంటకూ పెరుగుతున్న మృతులు
- ఘటనపై సిఎం స్టాలిన్ సీరియస్ ….
- కొత్త కలెక్టరు గా ప్రశాంత్ ,ఎస్పీగా చతుర్వేది..
- కేసును సిబిసిఐడి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన స్టాలిన్ ..
- ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 70 పైగా మంది…
- వారిలో 20 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చేబుతున్న వైద్యులు
- మెరుగైన వైద్యం అందించాలని స్టాలిన్ ఆదేశాలు
29 dead..over 70 hospitalised after consuming illicit liquor in TN :
కల్తీ సారా వ్యవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 29కు చేరింది. మరో 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి. కల్తీ సారా సేవించిన వారు వరుసగా మృతి చెందుతుండటంతో.. అప్పటికే సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది. వీరిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు.
సీఎం దిగ్బ్రాంతి
కాళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీసార మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను . నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని’ సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సీబీసీఐడీకి అప్పగింత
కాగా ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అవడంతో కల్లకురిచి కలెక్టరు,ఎస్పీ మీనా పై వేటు పడింది. కొత్త కలెక్టర్ గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమిస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం స్టాలిన్. గోవిందరాజు అనే వ్యక్తి కల్తీసారాను తయారుచేసి విక్రయించినట్లు గుర్తించారు అధికారులు. సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనాన్ని వినియోగించడం వల్లే మరణాలు సంభవించాయని ప్రాధమిక విచారణలో తేలింది. కాగా సీఎం స్టాలిన్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ప్రాణాలు పోతున్నా స్టాలిన్ మొద్దునిద్రపోతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ తమిళనాడు సీఎం పళని స్వామి మాట్లాడుతూ తమిళనాడు కల్తీ సారాకు అడ్డాగా మారిందని ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యత అని విమర్శించారు.