- దేశవిదేశాలలో యోగా చేసేవారి సంఖ్య పెరుగుతోంది: మోదీ
- శ్రీనగర్ లోని దాల్ సరస్సు సమీపంలో నిర్వహణ
- 2015లో యోగా ప్రస్తావనతో మొదలైన మార్పు
- ఫ్రాన్స్ మహిళా యోగా గురుకు పద్మశ్రీతో సత్కారించుకున్నాం
- ప్రపంచ విశ్వవిద్యాలయాలలో యోగాపై అధ్యయనాలు
- యోగాపై పరిశోధనా పత్రాలు ప్రచురితం
- 10వ అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
10th International Yoga Day Modi participated in Srinigar :
దేశవిదేశాలలో క్రమంగా యోగా చేసేవారి సంఖ్య పెరుగుతోందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. శ్రీనగర్ లోని దాల్ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. 2015 సంవత్సరంలో తొలిసారి యోగా గురించి ప్రస్తావించుకున్నాక మార్పు మొదలయిందని అన్నారు. యోగా నేర్పేందుకు ప్రస్తుతం వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించుకున్నామని మోదీ గుర్తుచేసుకున్నారు.
ఆమె ఎప్పుడూ భారత్కు రాకపోయినప్పటికీ.. యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందన్నారు. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్-ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. ఫలితంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగానూ ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్, బీఎల్ వర్మ, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, హెచ్డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అవగాహన కల్పించారు.
యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దిల్లీలోని యమునా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగసనాలు వేస్తూ అవగాహన కల్పించారు. మరో మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం దిల్లీలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ కూడలిలో వేలాది మంది ఆసనాలు వేసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.