CP Sajjanar: సోషల్ మీడియా క్రేజ్ను అడ్డుపెట్టుకొని లక్కీ డ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) హెచ్చరించారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన కొందరు ఆ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’ పేర మోసాలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇండ్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎర వేసి నిలువునా మోసం చేస్తున్నారన్నారు.
కేసులు నమోదు..
రీల్స్లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై ‘ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్(The Prize Chits and Money Circulation Schemes Banning Act) కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వారు సినిమా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లు అయినా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరన్నారు.
CM Revanth Reddy: తెలంగాణలో మరో బాసరగా.. ట్రిపుల్ ఐటీ కళాశాలకు శంఖుస్థాపన చేసిన సీఎం..!
మాటలు నమ్మి మోసపోవద్దు
లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇందుకోసం డయల్ 100కు గానీ, హైదరాబాద్(Hyderabad) సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కు వివరాలు పంపించాలని సూచించారు. లేదా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురిచేసే వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Also Read: Medak News: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకే పెద్దపీట

