Swetcha Effect: టూరిజం ప్రక్షాళనకు ఆ శాఖ సిద్ధమైంది. ‘‘హరిత హోటళ్లపై (Haritha Hotels) కొరవడిన పర్యవేక్షణ’’ పేరుతో ‘స్వేచ్ఛ’ కథనాన్ని ప్రచురించింది. ఆరోపణలు ఉన్న అధికారులకే మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారని ప్రత్యేకంగా పేర్కొంది. దీంతో పర్యాటక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బేగంపేటలోని హరిత ప్లాజాతో పాటు, హరిత హోటల్స్ రెస్టారెంట్లలో లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆ హోటల్కు జీఎంగా పని చేసిన వారి వివరాలు, నెలవారీగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఎవరెవరు ఎంత బకాయిలు పెట్టారు, ఎందుకు వసూలు చేయలేకపోయారు తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఆ బకాయిలను వారి నుంచి రికవరీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
తనిఖీలు, లావాదేవీల ఆడిటింగ్
కొన్ని హోటళ్లలో బ్లాంకెట్ హాల్, భోజనాలకు సంబంధించిన చెల్లింపులు, ప్రైవేట్ వారికి అద్దెకిచ్చినా వసూలు చేయకపోవడం, ఇన్ వాయిస్ ఇచ్చిన తర్వాత తప్పించుకొని లెక్కలు చూపకపోవడం, కొంతమంది మౌఖిక ఆదేశాలతోనే హోటల్స్ ఇవ్వడం, వారి నుంచి బిల్లులు వసూలు చేయకపోవడం, తదితర విషయాలు విచారణలో తెలిసినట్టు సమాచారం. భారీగా ఆదాయానికి గండి పడినట్లు, బకాయిలు పేరుకుపోయినట్లు ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన వారితో టూరిజం శాఖ చేసిన తనిఖీలో అంతా వెలుగులోకి వచ్చింది. దీనిపై టూరిజం శాఖ ఎండీ క్రాంతి సీరియస్ అయినట్లు తెలిసింది. ఏ అధికారి కాలంలో ఎంత బకా ఉందో వివరాలు తెలుసుకొని వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారి వేతనం నుంచే ఇదంతా రికవరీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. టూరిజం ఈడీ ఉపేందర్ రెడ్డి, మరో ఇద్దరు అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేసి తనిఖీలు, లావాదేవీల ఆడిటింగ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. పెనుబల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు..!
బదిలీలకు ప్లాన్
ఆరోపణల నేపథ్యంలో 10 మంది హరిత హోటల్స్ ఇన్ఛార్జులను మార్పు చేసినట్లు కూడా తెలిసింది. టూరిజం ఉద్యోగులు ఒకే దగ్గర ఎక్కువ కాలం పని చేయకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా వన్ బై త్రీ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయాలని, మూడేళ్లు పదవీ కాలం పూర్తి అయిన వెంటనే ఆ ఉద్యోగులను మరో చోటకి బదిలీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అవినీతి జరగదని, పరిపాలనా వ్యవస్థ సైతం పటిష్టం అవుతుందని భావిస్తున్నారు.
ఆ ముగ్గురు ఏం చేశారంటే?
ఏపీ టూరిజం కార్పొరేషన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు తెలంగాణకు చెందిన వారితో పైరవీ చేసుకొని ఇక్కడి టూరిజం శాఖలో ఉద్యోగాలు చేశారు. ఏపీ లోకాయుక్తలో వారిపై పెండింగ్ కేసులు ఉండగా, అక్కడి ప్రభుత్వం వారి రాజీనామాను ఆమోదించలేదు. అయినప్పటికీ తెలంగాణలో పైరవీతో ఉద్యోగాలు చేయడం గమనార్హం. అందులో ప్రసాద్ రెడ్డి 2021 అక్టోబర్ 1న, ఆర్వీ సురేష్ రెడ్డి 2024 అక్టోబర్ 17న తెలంగాణ టూరిజం శాఖకు చెందిన హోటల్స్కు జీఎంగా బాధ్యతలు చేపట్టారు. వీరికి తోడు టూరిజం శాఖ మాజీ ఎండీ స్వగ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సైతం కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్యకాలంలోనే ఈ ముగ్గురిపై ఆరోపణలు రావడంతో తొలగించినట్లు ప్రచారం జరుగుతున్నది. వీరి పదవీ కాలం ముగిసిందా, నిజంగానే ఆరోపణలతో తొలగించారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా టూరిజం శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభపరిణామం.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రంగంలోకి ఓయూ వీసీ.. సన్ డిగ్రీ కాలేజీకి భారీ జరిమానా

