Manchu Manoj: ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నానని అన్నారు టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్.తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్కు టిడిపి, జనసేన, న్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి, జమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు.
Also Read: Krishnaveni: ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి
టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరించి.. ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ తరచూ హాజరవుతూనే ఉంటారు. మంచు మనోజ్ రాకతో ఈసారి యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని, గ్రాండ్గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ‘జల్లికట్టు’ వేడుకలకు ముఖ్య అతిథిగా తనని పిలవడంపై హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘బ్రిటీష్ కాలం నుండి ‘జల్లికట్టు’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంతగా రక్తపాతాలు జరగవు. ఇక్కడ అంతా సాప్ట్గా ఉంటుంది. పశువుల పండగగా చాలా భక్తితో అందరూ జరుపుకుంటారు. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను టీమ్ చాలా జాగ్రత్తగా జరుపుతుంటారు. అందుకే ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. పోలీస్ వారు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారు. నన్ను కూడా ఎన్నో రూట్స్ మార్చి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుగారు కూడా ఇటీవల ఈ నియోజక వర్గానికి వచ్చి, ఎన్నో కొత్త పథకాలను ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను’’ అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.