The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందుకు తెలంగాణలో ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు. ప్రీమియర్ షో, టికెట్ల ధర హైక్ నిమిత్తం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం నిర్మాత, ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండిపోయారు. ప్రీమియర్స్కు అనుమతి రాలేదు కానీ, తెల్లవారుజామున టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ల్లో రూ.132, జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ల్లో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ అనుమతి జారీ చేసింది. గుడ్డిలో మెల్ల అనే చందంగా నిర్మాతలు కాస్త హ్యాపీగా ఉన్నారో, లేదో.. పెరిగిన ధరలపై హైకోర్టులో రచ్చ మొదలైంది.
Also Read- Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!
తెలంగాణలోనే ఎందుకిలా..?
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అనుమతులన్ని బాగానే వచ్చాయి. గురువారం రాత్రి 9 గంటల షో కూడా పడింది. టికెట్ల ధరలను కూడా భారీగానే పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఏ గొడవా లేకుండా అక్కడ సినిమా ఆడుతుంది. కానీ తెలంగాణలో మాత్రం అడుగడుగునా అడ్డంకులే అన్నట్లుగా తెలుగు సినిమా పరిస్థితి మారిపోయింది. ఈ టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణలో కొన్నాళ్లుగా ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలియంది కాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా కల్పించింది. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ని సినిమా హబ్ చేస్తామని అంటూనే, మరోవైపు సినిమా నిర్మాతలకు ఈ విషయంలో ప్రభుత్వాలు, కోర్టులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా రూల్ ఒకేలా ఉంటుంది కదా.. ఏపీలో ఏ గొడవ లేకుండా కామ్గా పని జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం వారికి ఆ అధికారం లేదు, వీరికి ఈ అధికారం లేదంటూ ప్రస్తుతం పెరిగిన ధరలపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!
ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్
అవును.. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రానికి సంబంధించి టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న న్యాయవాది విజయ్ గోపాల్ తన వాదనను వినిపించారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని, ఇలాంటి మెమో జారీ చేసే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, హైదరాబాద్లో సీపీకి మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని అన్నారు. ఈ సినిమాకు మెమో జారీ చేసిన అధికారికి రూ. 5 లక్షల జరిమానా విధించాలని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం టికెట్ల ధరల పెంపు మోమోపై మరోసారి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇంతకు ముందు సంబంధిత మంత్రి ఇకపై టికెట్ల ధరలను పెంచేది లేదని చెప్పారు కదా.. అయినా ఎందుకు టికెట్ల ధరల పెంపుకు అనుమతిస్తూ మెమోలిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. లాస్ట్ టైమ్ కూడా ఇలానే టికెట్ల ధరలను పెంచుకునే అవకాశం ఇచ్చి, కోర్టు సీరియస్ అవడంతో వెంటనే జీవోని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు రాజా సాబ్కి కూడా అదే జరిగే అవకాశం ఉందనేలా టాక్ వినిపిస్తుంది.
ప్రభుత్వ న్యాయవాది వాదనలివే..
ప్రభుత్వం తరుపున ప్రభుత్వ న్యాయవాది కూడా తన వాదనను వినిపించారు. టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేట్ వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు.. ఒక రిట్ పిటిషన్ మాత్రమే. అయినా సినిమా యూనిట్ అడిగిన అన్ని రిలాక్సేషన్స్కు మేము ఒప్పుకోలేదు. అందులో కొన్నిటికి మాత్రమే మేము ఓకే చెప్పాము. పెంచిన టికెట్ ధరలతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం. దీని ద్వారా సినీ కార్మికులు ఎందరో లబ్ధి పొందుతారు. సినీ కార్మికుల అసోసియేషన్ను పార్ట్ చేయకుండా, వారి వాదన వినకుంటే ఎలా? అంటూ జీపీ తన వాదనను వినిపించారు. చూద్దాం.. ఫైనల్గా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో.. దానికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

