Oscar Academy: లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ అకాడమీలోకి వీరికి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీలో చోటు సంపాదించిన వారి జాబితాను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) విడుదల చేయగా అందులో వారికి అవకాశం లభించింది. వీరితోపాటు దర్శకురాలు పాయల్ కపాడియా (Payal Kapadia), ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు (Maxima Basu) సైతం ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా 534 మందిని ఆహ్వానించినట్లు ఆస్కార్ అకాడమీ ప్రకటించింది.
సినిమాకు సంబంధించి 19 విభాగాలకు చెందిన వారికి ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పలికింది. ఈ ఏడాది చోటు దక్కించుకున్న 534 మందిలో 41 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. ఎంతో ప్రతిభవంతులైన వారికి చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని ఆస్కార్ అకాడమీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆస్కార్ కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలియజేసింది.
Also Read: Adulterated Diesel: ఇదేందయ్యో.. సీఎం కాన్వాయ్కు కల్తీ డీజిల్.. నడిరోడ్డుపై ఆగిన 19 వాహనాలు!
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుకలు జరగనున్నాయి. జనవరి 12 నుంచి 16 మధ్య నామినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. కాగా ఆస్కార్ అకాడమీలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కు చోటు కల్పించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతీయులకు.. ముఖ్యంగా తమిళులకు గర్వకారణమని ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ పెట్టాడు. కమల్ కు ఈ అరుదైన గౌరవం లభించడం సముచితమని మరో వ్యక్తి పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఆస్కార్ అకాడమీలో చోటు సంపాదించిన ఇతర భారతీయులకు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు.