Minister Seethakka: మావోయిస్టుల లేఖపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. అయితే లేఖలో లేని అంశాలపై ఒక రాజకీయ పార్టీకి చెందిన పత్రికలు, మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అని చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ తమ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నాయని మండిపడ్డారు. మహిళపై అసభ్య పదజాలాన్ని వినియోగించడం ఆవేదన కలిగిస్తోందని సీతక్క అన్నారు. ఒక మహిళను పట్టుకుని సిగ్గులేదా? అని రాయడం ఏం జర్నలిజం ప్రశ్నించారు.
కోయ బిడ్డకు పదవి వచ్చిందని..
తాను ప్రజలకు ఎన్నడూ దూరంగా లేనని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. వారంలో 2, 3 రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లోనే ఉంటానని తెలిపారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని స్ఫష్టం చేశారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయని.. ఇప్పుడు అవే శక్తులు తనను టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. ఒక కోయ మహిళలకు జనరల్ పోర్ట్ ఫోలియో దక్కడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. 75 సంవత్సరాల్లో మొట్ట మొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే సహించలేకపోతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 49తో అటవీ బిడ్డలు నష్టపోతారని ఆ జీవోను వ్యతిరేకించినట్లు చెప్పారు.
జీవో 49ను రద్దుచేయాలని నేనే కోరా
తమ జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటి జీవో 49ను రద్దు చేయాలని తానే కోరినట్లు మంత్రి సీతక్క అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రి కాకున్నా.. పార్టీలకు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీవో 49 ను రద్దు చేయాలని తీర్మాణించినట్లు చెప్పారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడవి బిడ్డనేనని సీతక్క స్పష్టం చేశారు. వారి సంక్షేమం, అభివృద్ది కోసమే తన జీవితం అంకితమని చెప్పారు. ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశానని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నానని చెప్పారు. అడవి బిడ్డల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
నా విధానం ఎప్పటికీ అదే
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు తమ దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో స్వయంగా మాట్లాడినట్లు సీతక్క తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు జరగకుండా చర్యలు చేపడుతామని హమీ ఇచ్చారు. ప్రతిపక్షంలోనైన అధికార పక్షంలోనైనా నాదొకటే నినాదమని.. ‘కొత్త అడవి కొట్టొద్దు.. పాత అడవిని వదిలిపెట్టొద్దు’ అన్నదే తన విధానమని చెప్పుకొచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా అదే నా పోరాటమని స్పష్టం చేశారు. ఆదివాసులు, అట్టడుగు వర్గాలు, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని సీతక్క స్పష్టం చేశారు.
Also Read: Dinosaur Skeleton At Museum: ఓరి దేవుడా.. నిజమైన డైనోసార్.. చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే!
బీఆర్ఎస్కు ఇప్పుడు గుర్తొచ్చారా!
బీఆర్ఎస్ హయాంలో ఆదివాసులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని మంత్రి సీతక్క గుర్తుచేశారు. అప్పుడు దాడులు చేసి ఇప్పుడు ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టారని.. చెట్లకు కట్టేసి కొట్టారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోడు సమస్యలను పరిష్కరించలేదని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. వారి హయంలోనే అడవిబిడ్డలకు ఇండ్లు ఇచ్చి ఉంటే అసలు సమస్యలే వచ్చి ఉండేవి కావని అన్నారు. మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని నన్ను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ప్రజలిచ్చిన మంత్రి పదవితో ఏజెన్సీ ప్రజలు, పేదలను అభివృద్ధి పరుస్తున్నట్లు సీతక్క వివరించారు.