CM Revanth Reddy: సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. సినీ కార్మికులపై వరాలు కురిపించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి, సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతతో పాటు వారి సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వాళ్లను సంప్రదించి హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ తరలి రావడానికి ప్రోత్సహించారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్న వారి శ్రమ, కష్టం నాకు తెలుసు. వారి సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు, నిర్మాత దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించాను. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఆయన వారధిగా ఉంటారనే ఆ బాధ్యతలు అప్పగించాం. అలాగే, ఎప్పుడో నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నాం. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉంది. ఈ విజయం వెనక కార్మికుల శ్రమ ఎంతో ఉంది.
Also Read- Zoho Payments: ‘జోహో పే’ వచ్చేస్తోంది.. గూగుల్ పే, ఫోన్పే యూజర్లు ఎటువైపు మొగ్గుతారో?.. ఫీచర్లు ఇవే
ఆ బాధ్యత నాది
హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే మా కోరిక. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. సినిమా వాళ్లంతా అండగా నిలబడితే.. హాలీవుడ్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. కృష్ణా నగర్లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తాం.
Also Read- Dacoit: అడవి శేష్ ‘డకాయిట్’ రిలీజ్ డేట్ మారింది.. ఇక వచ్చే సంవత్సరమే!
20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు అందిస్తేనే
సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి. భవిష్యత్లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే.. అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు అందిస్తేనే అనుమతి జీవో అందించేలా నిబంధనలు సడలిస్తాం. కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్ధిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్కు స్థలం కేటాయిస్తాం. కర్ణుడు ప్రాణం పోయినా మిత్ర ధర్మం వదలలేదు.. అలాగే, కార్మికులకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతాం. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళతాం. మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
