తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Crime News: బస్సులో వెళుతుండగా మహిళ పర్సును కొట్టేసిన దొంగలు అందులో ఉన్న సెల్ ఫోన్ ద్వారా ఆమె బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని ఇటీవల తార్నాక నుంచి కాచిగూడ రావటానికి బస్సు ఎక్కింది. కాగా, దారిలో దొంగలు ఆమె పర్సును కొట్టేశారు. దాంతో తన పర్సు చోరీ అయ్యిందంటూ ఆమె కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన పర్సులో తన సెల్ ఫోన్ కూడా ఉన్నట్టు పేర్కొంది.
ఆ తరువాత రెండు రోజులకు తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకోగా లక్షా 4వేల రూపాయలు విత్ డ్రా అయినట్టుగా ఆమెకు తెలిసింది. బ్యాగ్ తోపాటు చోరీకి గురైన ఆమె సెల్ ఫోన్ లో ఆన్ లైన్ బ్యాంకింగ్ కు సంబంధించిన పాస్ వర్డులు, ఏటీఎం కార్డు నెంబర్ తదితర వివరాలు ఉండటంతో వాటి ద్వారా దొంగలు బ్యాంక్ ఖాతాలోని నగదును ఖాళీ చేసినట్టుగా తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొబైల్ ఫోన్లలో ఆన్ లైన్ బ్యాంకింగ్ కు సంబంధించిన పాస్ వర్డులు, ఏటీఎం కార్డుల నెంబర్లు స్టోర్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. ఒకవేళ స్టోర్ చేసినా ఫోన్ చోరీ అయినా, పోయినా వెంటనే బ్యాంక్ సిబ్బందిని అలర్ట్ చేసి ఎలాంటి లావాదేవీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: Viral News: ఇదేం గడియారంరా బాబు.. పిల్లాడివే కానీ, చించేశావ్!