Murder: మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కక్షలు పెంచుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. అలాంటి అమానవీయ ఘటన తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగింది. ఆస్తిలో వాటా ఇవ్వనందుకు అక్కాచెల్లెళ్లు కలిసి సొంత అన్నపై దాడి చేశారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి భార్య కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో నివాసముండే జంగిలి శ్రీనివాస్ అనే వ్యక్తిపై అతని చెల్లెళ్లు శారదా, వరలక్ష్మి ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఇద్దరు కర్రలతో దాడి చేయడంతో శ్రీనివాస్ కు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే అతన్నిసమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కానీ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
కాగా గుంట భూమి కోసం చెలరేగిన వివాదమే దాడికి కారణమని జంగిల్ శ్రీనివాస్ భార్య తెలిపారు. పది సంవత్సరాలుగా తమ ఆడపడుచులు తమ ఇళ్ల విషయంలో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె చెప్పారు. ఈ తగాదాల కారణంగానే కొంతకాలంగా తాము సొంత ఇంటి వద్ద కాకుండా మరొక చోట అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. అయితే రోజూ లాగే తమ అత్త, మామలకు టిఫిన్ ఇవ్వడానికి తన భర్త వెళ్లగా అక్కడే ఉన్న ఆయన చెల్లెళ్లు దాడికి పాల్పడ్డారని వివరించారు.
అనంతరం జంగిల్ శ్రీనివాస్ కుటుంబ సభ్యలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు శారద, వరలక్ష్మిలు స్టేషన్ లో లొంగి పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ జరుపుతున్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హత్యలు కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతండటం మానవ సంబంధాలు ఎంతలా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయో తెలియపరుస్తున్నాయి. ఇటీవల తనను కంపెనీలో డైరెక్టరుగా తీసుకెళ్లలేదని ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలిజ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర రావును ఆయన మనవడు (కూతురు కొడుకు) కీర్తితేజ దారుణంగా హతమార్చాడు. ఏకంగా కత్తితో ఆయన కడుపులో 73 సార్లు పొడిచాడు. తాతను చంపి పారిపోయిన అతన్ని పోలీసులు పట్టుకుని విచారించారు. తన తాత చంద్రశేఖర రావు తనను ‘బెగ్గర్’ అనే పదేపదే పిలుస్తూ అవమానించేవాడని, తన పెద్దమ్మ కొడుకుకు కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించాడని విచారణలో కీర్తితేజ వెల్లడించాడు. చంద్రశేఖర రావు అంటే కుబేరుడు. ఆయనకు పలు చోట్ల పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ కుటుంబంలో కోట్లాది రూపాయల రాబడి, ఆస్తిపాస్తులు ఉండటంతో సహజంగానే తగాదాలు మొదలయ్యాయి. కానీ, తాజాగా జగిత్యాల ఘటనలో అది ఓ చిన్న ఫ్యామిలీ. వివాదం చెలరేగింది ఒక్కటంటే ఒక్క గుంట భూమి కోసం అని తెలుస్తోంది. అంత ఆస్తి కోసం ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నారంటే మనం ఏ పరిస్థితుల్లో బతుకుతున్నామో ఆలోచించుకోవచ్చు. పోనీ అదీ హైదరాబాద్ లాంటి నగరమా? గజానికి లక్ష రూపాయల విలువ చేస్తుందా స్థలం విలువ.. అంటే అదీ కాదు. దాని కోసం ఇంతకు తెగించడం అనేది నిజనిజాల సంగతి ఎలా ఉన్నా మూర్ఖత్వమే అనిపిస్తోంది.