MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఈడీ, సీబీఐల కేసుల్లో బెయిల్ కోసం ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఉభయ పక్షాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ నెలాఖరులో వెలువడే చాన్స్ ఉన్నది. అసలు బెయిల్ లభిస్తుందో లేదో తెలియదు. కాగా, దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం మరో అదనపు చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అదనపు చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో అనుబంధ చార్జిషీట్ను రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ అనుబంధ చార్జిషీట్లోనూ కవిత పేరు ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు కవిత, చరణ్ప్రీత్లతోపాటు దామోదర్ శర్మ, ప్రిన్స్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. అనంతరం, కవిత, చరణ్జిత్లు జూన్ 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. దీంతో వీరు కూడా జూన్ 3వ తేదీన కోర్టులో హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్నాయి. పాలసీలో అవకతవకలకు సంబంధించి సీబీఐ, మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.ఈ కేసుల్లో బెయిల్ కోసం తొలుత రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈడీ, సీబీఐలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని, ఆమె శక్తిమంతురాలని, ఈ స్కామ్లో కీలక పాత్రధారి అని వాదించాయి. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అంతకు ముందే కొడుకు పరీక్షల కోసం ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనూ కవిత, ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్లో ఉన్నది. ఒక వేళ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ లభిస్తే కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ, ఇప్పుడు మరో అనుబంధ చార్జిషీట్ను ఈడీ దాఖలు చేసి ఆ అవకాశాలనూ మరింత పలుచనచేసినట్టు అర్థం అవుతున్నది.