– ముమ్మరంగా ఎన్నికల తనిఖీలు
– తెలంగాణలో రూ. 156 కోట్ల సొత్తు సీజ్
– ఫ్లయింగ్ స్క్వాడ్స్ రాకతో పెరిగిన తనిఖీలు
– సామాన్యులకు తలనొప్పిగా మారిన సోదాలు
– కోడ్ ముగిసే దాకా తప్పదంటున్న పోలీసులు
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల వేళ.. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడిక్కడ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేస్తున్న సోదాల్లో భారీగా నగదు, మద్యం, నగలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.156 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఇక పట్టుబడిన సొత్తు వివరాల్లోకి వెళితే.. నగదు రూ.61.11 కోట్లు, రూ.28.92 కోట్ల విలువైన మద్యం, రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో రూ.19.16 లక్షల కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు, రూ.22.77 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, కుక్కర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
పోలీసుల తనిఖీల్లో హవాలా మార్గాల్లో తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడుతోంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం రూ. 45 కోట్లు విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు పట్టుబడగా.. ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే.. రూ.50 కోట్ల సొత్తు పట్టుబడటం గమనార్హం..! నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత నగదు ప్రవాహం మరింత ఎక్కువగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో రాష్ట్రంతోపాటు, రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 466 ఫ్లయింగ్ స్క్వాడ్లు, రాష్ట్ర సరిహద్దుల్లో 85 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
Also Read: విజయానికి స్ఫూర్తి.. ఆమే! మహిళ ఓటర్లకు జై కొడుతున్న పార్టీలు
మరోవైపు రహదారులపై ఎక్కడిక్కడ పోలీసులు చేస్తున్న తనిఖీలతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్న వారు సైతం రూ. 50 వేలకి మించి డబ్బు తీసుకెళ్లే అవకాశం లేకపోవటం, దుస్తులు, బంగారం కొనాలంటే ఆన్లైన్ పేమెంట్స్ చేయటానికి సిద్ధమవుతున్నారు. మార్కెట్లో కస్టమర్స్ నుంచి రోజూ నగదు కలెక్ట్ చేసే వారు, నగల వ్యాపారులు, దుకాణాల్లోకి సరుకు కొనేందుకు వెళ్లే వ్యాపారులు, పంట అమ్ముకుని డబ్బు తెచ్చుకునే రైతులు, ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం వెళుతున్న వారు తరచూ పోలీసు తనిఖీల్లో బాధితులుగా నిలవటం, వారు పోలీసులకు రోడ్లపై వాగ్వివాదానికి దారితీస్తోంది. అయితే, తగిన ఆధారాలు చూపిస్తే నగదు తిరిగి ఇస్తామని చెబుతున్నా, ఇప్పటి తమ అవసరాలు ఎలా తీరతాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.