ఆస్పత్రిలో బాణసంచా పెట్టిందెవరు?
నిత్యం రోగులు, వారి అటెండెంట్లతో రద్దీగా ఉండే నిమ్స్ హాస్పిటల్లో ఏప్రిల్ నెలలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని ట్రామా కేర్భవనం 5వ అంతస్తులో ఈ సంఘటన చోటుచేసుకున్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అప్పుడు అధికారులు చెప్పారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులోనే ఉన్న ఆరోగ్య శ్రీ గదిలో పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ చేసినట్టుగా వీడియోలు బయటకు రావటం. నిబంధనల ప్రకారం ఆస్పత్రులు, విద్యా సంస్థలు తదితర వాటిలో బాణసంచాను నిల్వ చేయటానికి వీల్లేదు. అయితే, నిమ్స్ఆస్పత్రిలో మాత్రం బాణసంచాను నిల్వ చేసినట్టుగా వెలుగు చూసిన వీడియోలు అప్పట్లో తీవ్ర కలకలమే సృష్టించాయి. దీనిపై అదనపు మెడికల్ సూపరిండింటెంట్ లక్ష్మీభాస్కర్ ఫిర్యాదు చేయగా పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో మరో అదనపు మెడికల్ సూపరిండింటెంట్ కృష్ణారెడ్డి ఈ వీడియోలు తీసినట్టుగా వెల్లడైంది. తానే ఆ వీడియోలు తీశానని చెప్పిన కృష్ణారెడ్డి బాణసంచాను తెచ్చి ఆస్పత్రిలో ఎవరు పెట్టారో? నిగ్గు తేల్చాలని పోలీసులను కోరారు. అయితే, పంజగుట్ట పోలీసులు మాత్రం ఈ కేసు దర్యాప్తులో బాణసంచాను తెచ్చి ఆస్పత్రిలో ఎవరు పెట్టారన్న దానిపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేల్చారు. వీడియోలు తీసిన కృష్ణారెడ్డితోపాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించామన్నారు. అయినా, కేసును పరిష్కరించే ఆధారాలు లభించక పోవటంతో దానిని తాత్కాలికంగా మూసి వేస్తున్నామని కోర్టుకు నివేదిక ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా ఆధారాలు దొరికితే కేసును రీ ఓపెన్ చేస్తామని తెలియచేశారు.
Read Also- Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కథేంటి.. అసలు సూత్రాధారులు ఎవరు?
ఆయనపైనే అనుమానాలు!
పోలీసుల విచారణ సరైన దిశలో జరగకుండా నిమ్స్ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యాధికారి పావులు కదిపారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజున పోలీసులు ఆయన గదిలో విచారణ పేరిట గంటపాటు మాట్లాడినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ గదిలో ఉన్న బాణసంచా మాయమైందన్నారు. దీంతోపాటు అదే గదిలో ఉన్న కొన్ని సూట్ కేసులు కూడా కనిపించకుండా పోయాయని చెప్పారు. ఈ బాణసంచా, సూట్కేసులను అక్కడి నుంచి ఎవరు తరలించారన్న విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకోలేకపోవటం విడ్డూరంగా ఉంది. ఈ ప్రమాదంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం కావటంతో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్బీ. శ్రీనివాస్,ఛైర్మన్గా, ఆర్థోపెడిక్విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్, నిమ్స్రాజీవ్ఆరోగ్య శ్రీ కో- ఆర్డినేటర్ మహేశ్ బాబు, సెక్యూరిటీ అధికారి రామారావు సభ్యులుగా కమిటీ వేసి అంతర్గత విచారణ జరిపించారని చెప్పారు. అయితే, ఈ కమిటీ తూతూ మంత్రంగా విచారణ జరిపి పైఅధికారులకు నివేదిక ఇచ్చిందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. బాణసంచాను మాయం చేసింది ఎవరు? కనిపించకుండా పోయిన సూట్ కేసుల్లో ఏమున్నాయి? అన్నది నిగ్గు తేల్చాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం.
Read Also- Tourist Guide: టూర్లకు వెళ్తున్నారా.. ఈ మోసాల గురించి తెలుసుకోండి.. లేదంటే మీ పని ఔట్!