– ఆనాడేం జరిగింది? ఈనాడేం జరిగింది?
– బీఆర్ఎస్ హయాంలో సంచలనం రేపిన సీఐ నాగేశ్వరరావు ఘటన
– రివాల్వర్తో వివాహితను బెదిరించి అత్యాచారం
– తప్పును కప్పిపుచ్చేందుకు కిడ్నాప్ డ్రామా
– తనకున్న పరిచయాలతో తప్పించుకునే ప్రయత్నం
– చర్యలు తీసుకోవడంలో ఆనాటి ప్రభుత్వ అలసత్వం
– మళ్లీ సర్వీసులోకి వచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు
– కానీ, భవాని సేన్ గౌడ్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ క్విక్ రియాక్షన్
– ఘటన జరిగిన గంటల్లోనే 311 ప్రకారం ఎస్సైపై వేటు
– శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని సీఎం రేవంత్ ఆదేశాలు
Criminals in police department: మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో కాళేశ్వరం పేరు తెలంగాణ రాజకీయాల్లో నిత్యం మారుమోగుతుంటుంది. తాజాగా మరో కేసు విషయంలో చర్చనీయాంశంగా మారింది. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న భవాని సేన్ గౌడ్, తనతోపాటే పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గన్తో బెదిరించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారానికి దారి తీస్తోంది.
రేవంత్ సర్కార్ క్విక్ రియాక్షన్
ఘటన జరిగిన గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సైపై సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవాని సేన్ గౌడ్ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు. ఆ వెంటనే, మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు వెల్లడించారు. సీఎం స్పందన, ఉన్నతాధికారుల రియాక్షన్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే స్పందించిన తీరు బాగుందని, తీసుకున్న చర్యలు సబబేనని అటు మహిళా సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు అంటున్నాయి. అయితే, ఈ ఘటనను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.
అప్పట్లో ఇలాగే చేసిన సీఐ నాగేశ్వరరావు.. కానీ!
2022 బీఆర్ఎస్ హయాంలో మారేడ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేసేవాడు నాగేశ్వరరావు. ఇతను కూడా ఓ వివాహితను గన్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాధిత మహిళ, ఆమె భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా, యాక్సిడెంట్ జరగడంతో బండారం బయటపడింది. ఆ తర్వాత తన పలుకుబడితో కేసు నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు అరెస్ట్ అయ్యాడు. అయితే, ఇతన్ని కూడా అప్పట్లో సర్వీస్ నుంచి తొలగించారు. కాకపోతే, సరైన విధంగా ఇది జరగలేదని, మళ్లీ సర్వీసులోకి వచ్చేందుకు నాగేశ్వరరావు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. భవాని సేన్ గౌడ్ ఇష్యూలో తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడడంపై మండిపడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి స్పందించిన తీరుకు, ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చాలా తేడా ఉందని వివరిస్తున్నారు. సగం సగం పనులు చేయడం వల్లే నాగేశ్వరరావు మళ్లీ విధుల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడని, భవాని సేన్ విషయంలో సీఎం రేవంత్ పక్కాగా చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.