తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cocaine Seized Hyderabad: డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశస్తున్ని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు కాచిగూడ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 7 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన ఎంగ్ చుక్వు గాడ్విన్ ఎలియాస్ గాడ్విన్ 2015లో స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చాడు.
అనంతరం కాకినాడలోని ఓ ఫార్మసీ కాలేజీలో చేరాడు. కాగా, తన దేశానికే చెంది ఇక్కడ ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న కొందరితో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గాడ్విన్ కూడా మాదక ద్రవ్యాలను విక్రయించటం మొదలు పెట్టాడు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తూ ముంబయి, బెంగళూరులో ఉంటున్న పెడ్లర్ల నుంచి కొకైన్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చేవాడు. ఇక్కడ డగ్ర్స్ అలవాటు ఉన్నవారికి దానిని డెడ్ డ్రాప్ పద్దతిలో అమ్ముతూ వస్తున్నాడు.
Also Read: Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్
ఈ క్రమంలో 2022, మే నెలలో ధూల్ పేట ఎక్సయిజ్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు. బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన గాడ్విన్ తిరిగి కొకైన్ అమ్ముతూ 2023, జనవరిలో హయత్ నగర్ ఎక్సయిజ్ పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యారు. కొన్నాళ్లకు బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా, ఇక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావటంతో ముంబయి వెళ్లి అక్కడే స్థిరపడ్డ గాడ్విన్ నెలలో ఒకటి రెండుసార్లు కొకైన్ తో హైదరాబాద్ వచ్చి కొకైన్ అమ్మకాలు చేస్తున్నాడు.
ఇలాగే ఓ వ్యక్తికి 7 గ్రాముల కొకైన్ ఇవ్వటానికి కాచిగూడలోని డీ మార్ట్ వద్ద వేచి చూస్తుండగా సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు కాచిగూడ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాచిగూడ పోలీసులకు అప్పగించారు.