Crime News: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగులు కాసి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఇద్దరు వాటి నుంచి బయట పడటానికి పని చేస్తున్న సంస్థకే టోకరా ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు నగలతో పరారయ్యారు. చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వీరిని సైఫాబాద్ పోలీసులు సీసీఎస్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వజ్రాలు(Diamonds) పొదిగిన 173 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి(DCP Shilpavalli) మీడియా సమావేశంలో అదనపు డీసీపీ ఆనంద్(DCP Anandh), సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్(ACP Sanjay Kumar) తో కలిసి వివరాలు వెల్లడించారు.
మమ్మద్ గులాం రసూల్..
ముంబయికి చెందిన చేతన్ (24), మహ్మద్ గులాం రసూల్ (22) స్నేహితులు. చేతన్ ముంబయిలోనే ఉన్న శన్య డైమండ్స్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గా పని చేస్తుండగా మహ్మద్ గులాం రసూల్(Muhammad Ghulam Rasool) చదువుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇద్దరికీ ఐపీఎల్(IPL) క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగులు పెట్టే అలవాటు ఉంది. ఈ క్రమంలో పెద్ద మొత్తాల్లో డబ్బు పోగొట్టుకున్న చేతన్, మమ్మద్ గులాం రసూల్ అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చే మార్గం కానరాక పోవటంతో ఇద్దరు కలిసి శన్య డైమండ్స్ కు టోకరా ఇవ్వాలని పథకం వేసుకున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు నగలను తయారు చేసే శన్య డైమండ్స్ మార్కెటింగ్ కోసం వాటిని చేతన్ కు ఇచ్చి హైదరాబాద్ పంపించేది. ఇక్కడ వేర్వేరు జువెలరీ షాపులకు వెళ్లి వాటిని చూపించి చేతన్ ఆర్డర్లు బుక్ చేసేవాడు. మార్కెటింగ్ పని అయిపోయిన తరువాత తన వద్ద ఉండే ఆభరణాలను బషీర్ బాగ్ లోని విజయ్ శంకర్ లాల్ జువెలర్స్ దుకాణంలో భద్రపరిచేవాడు.
Also Read: Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..
యజమాని లాకర్ ను తెరిచి చూడగా..
ఇదిలా ఉండగా కొన్నిరోజుల నుంచి ఎలాంటి ఆర్డర్లు రాకపోవటం.. చేతన్ నగలను తీసుకుని తిరిగి రాకపోవటంతో శన్య డైమండ్స్(Shanya Diamonds) యాజమాన్యం విజయ్ శంకర్ లాల్(Vijay Shankar Lal) జువెలర్స్ వర్గాలను సంప్రదించింది. అన్ని నగదు సురక్షితంగా ఉన్నాయా? లేదా? అన్నది చూసి చెప్పాలని అడిగింది. ఈ క్రమంలో విజయ్ శంకర్ లాల్ జువెలర్స్ యజమాని లాకర్ ను తెరిచి చూడగా అందులో ఒక్క నగ కూడా కనిపించ లేదు. దాంతో ఆయన శన్య డైమండ్స్ యజమానికి సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు ముంబయి నుంచి వచ్చిన శన్య డైమండ్స్ యజమాని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సైఫాబాద్ సీఐ కే.రాఘవేందర్, డీఐ ఎన్.రాజేందర్, సీసీఎస్ సీఐ భిక్షపతితో కలిసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చేతన్, మహ్మద్ గులాం రసూల్ లు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్టు గురువారం సమాచారం అందుకుని దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్