– నగరంలో గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం
– 500 మందిని ముంచేసిన ప్రహణేశ్వరి ట్రేడర్స్
– వంద కోట్లతో ఉడాయించిన ఎండీ రాజేష్
– ఫోన్ నెంబర్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
– న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన
Cheating: నగరంలో స్కీముల పేరుతో స్కాములకు కొదవే లేదు. చిట్స్ పేరుతో ఒకరు, ప్రీలాంచ్ అంటూ ఇంకొకరు, ఇలా రోజూ ఏదో ఒక స్కామ్ వెలుగు చూస్తేనే ఉంటుంది. ఎవరో ఒకరు మోసపోయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఉండడం లేదు. తాజాగా గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేసింది ప్రహణేశ్వరి ట్రేడర్స్ సంస్థ. జనం నుంచి సుమారు వంద కోట్ల వరకు వసూలు చేసి నిండా ముంచేశాడు ఎండీ రాజేష్. హబ్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించాడు రాజేష్. 2 శాతం లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. రెండు నెలల పాటు లాభాలను చెల్లించి, నమ్మకం కలిగించాడు. తర్వాత పెద్ద మొత్తంలో వారి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయించాడు. తర్వాత డబ్బులతో ఉడాయించాడు.
గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ను ఆదివారం అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఎంతో కష్టపడి పిల్లల పెళ్లిళ్లు, చదువు, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్మును దోచేశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు అందేలా చూడాలని కోరారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు బాధితులు.