- సికింద్రాబాద్ అల్ఫా హోటల్ పై కేసు నమోదు
- ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు..
- ఫ్రిడ్జిలో చాలాకాలంగా నిల్వ వుంచిన మటన్
- పాడైపోయిన మటన్ తో బిర్యానీ
- తయారీ డేట్ లేకుండా ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్ల అమ్మకాలు
- అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా కిచెన్ నిర్వహణ
- కేసులు నమోదు చేసిన అధికారులు
Food Safty Officers attacked on Secunderabad Alfa Hotel expairy meat:
స్వేచ్ఛ, సికింద్రాబాద్:
సికింద్రాబాద్ ‘ఆల్ఫా’ హోటల్కు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక్కసారైనా ఇక్కడ తినాలని బిర్యానీ ప్రియులు అనుకుంటూ ఉంటారు. మరీముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఇక్కడ బిర్యానీ, రోటీలు, చికెన్, మటన్ కర్రీలకోసం తెగ క్యూ కట్టేస్తూ ఉంటారు. నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ.. టీ దగ్గరి నుంచి బిర్యానీ వరకు తమకు నచ్చిన ఫుడ్ ఐటెంను తింటుంటారు. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంతో అటు రైలు దిగి.. అల్ఫా వైపు అడుగులేస్తుంటారు జనాలు. అలాంటి చరిత్ర కలిగిన హోటల్ లో ఫుడ్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది.
ఫుడ్ టాస్క్ ఫోర్స్ దాడులు
నగరంలో పలు హోటల్స్లో టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై అధికారులు కేసు నమోదు చేశారు.
దారుణంగా కిచెన్
కాగా, ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు. కిచెన్లో దారుణ పరిస్థితులను(అపరిశుభ్రత) వెలుగులోకి తెచ్చారు. అలాగే, పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఇక, తయారు చేసిన ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపారు.
తీరుమార్చుకోని యాజమాన్యం
గతేడాది సెప్టెంబర్ లో కొందరు యువకులు ఈ అల్ఫాలో మటన్ కీమా, రోటీ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ యువకుల మిత్రులు కొందరు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగి హోటల్లో నిశితంగా తనిఖీలు చేయగా.. నాణ్యత, శుభ్రత లేదని గుర్తించిన అధికారులు వెంటనే హోటల్ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆల్ఫా హోటల్ను యాజమాన్యానికి అధికారులు నోటీసులు కూడా అందించారు. కాగా.. ఆ రోటీలను పరిశీలించగా దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.