Crime News: హుజురాబాద్ పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బోర్నపల్లిలో ఉన్న 132/33 కేవీ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన వివరాలు..
మృతుడిని హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ రెడ్డిగా గుర్తించారు. ఆయన సబ్స్టేషన్లో ఆర్టిజన్ గ్రేడ్-2 అసిస్టెంట్ ఆపరేటర్గా స్టేషన్ లో పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో సబ్స్టేషన్ పరిధిలోని ఒక విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా, అకస్మాత్తుగా తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలింది. షాక్ ధాటికి శంకర్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించారు.
Also Read; Old Age Couple: 80 ఏళ్ల వయసులో వృద్ధ జంట ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ఆందోళన
ఈ దుర్ఘటనతో సబ్స్టేషన్ సిబ్బంది మరియు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ అక్కడి కార్మిక సంఘాలు ధర్నాకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వారు నిరాకరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..